అక్షరటుడే, వెబ్డెస్క్ : Mumbai Heavy Rains | ముంబైలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాలు జలమయం అయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూలై 2 ఉదయం 8 గంటల నుండి జూలై 3 ఉదయం 6 గంటల మధ్య ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. మండవి ఫైర్ స్టేషన్ వద్ద అత్యధికంగా 150.2 మి.మీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ (IMD) ముంబైకి రాబోయే మూడు గంటల పాటు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
ముంబై, థానే, పాల్ఘర్, రాయ్గఢ్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ముంబై (Mumbai) నగరం, శివారు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని BMC అంచనా వేసింది.
Mumbai Heavy Rains | భారీ అలలు
మున్సిపల్ సంస్థ సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2:18 గంటలకు 4.28 మీటర్ల ఎత్తుతో సముద్రపు పోటు (high tide) వస్తుందని, ఆ తర్వాత రాత్రి 8:22 గంటలకు సముద్ర మట్టం 1.74 మీటర్లకు తగ్గుతుందని అంచనా. శనివారం తెల్లవారుజామున 2:09 గంటలకు మరోసారి 3.68 మీటర్ల ఎత్తుతో సముద్రపు పోటు వస్తుందని, ఆ తర్వాత ఉదయం 7:44 గంటలకు సముద్ర మట్టం 1.05 మీటర్లకు తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. . భారీ వర్షాలు, సముద్రపు పోటు కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉందని తెలిపారు. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ అంతరాయాలు నెలకొంటాయని పేర్కొన్నారు.
Mumbai Heavy Rains | చెట్టు కూలి 8 మందికి గాయాలు

భారీ వర్షాల కారణంగా గురువారం మధ్యాహ్నం ముంబైలోని శాంతాక్రూజ్ ప్రాంతంలో చెట్టు కూలి ఎనిమిది మంది గాయపడ్డారు. శాంతాక్రూజ్ (పశ్చిమ)లోని రాహేజా కళాశాల సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ భవన ప్రాంగణంలో మధ్యాహ్నం 2.02 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని బీఎంసీ తెలిపింది. కూలిపోయిన చెట్టును పరిశీలించడానికి ప్రజలు వెళ్లగా, వారిపై మరో చెట్టు కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడగా, వారిని నానావతి ఆసుపత్రిలో చేర్చారు.
ఇది కూడా చదవండి..: Telegram Signal Notices | టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. యూజర్నేమ్ ఫీచర్పై వివరాలు కోరిన MeitY