అక్షరటుడే, వెబ్డెస్క్: Nepal Flood Rescue | ప్రకృతి సృష్టించిన బీభత్సంలో ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. మృత్యువుతో పోరాడి, చావు అంచుల వరకు వెళ్లి 11వ రోజున ఓ వృద్ధురాలు పునర్జన్మ పొందింది. నేపాల్లో సంభవించిన ప్రాణాంతక వరదల్లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.
Nepal Flood Rescue | ఆహారం, నీరు లేకుండా ఆ బురద కూపంలోనే
నేపాల్లోని నువాకోట్ జిల్లా బెత్రావతి ప్రాంతంలో ఇటీవల వచ్చిన వరదల దాటికి ఒక నాలుగు అంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతిని, బురదలో కూరుకుపోయింది. ఆ సమయంలో భవనంలో ఉన్న చండికా కుమారి శ్రేష్ఠ (64) అనే మహిళ బయటకు రాలేక, లోపలే చిక్కుకుపోయారు. దాదాపు 10 రోజుల పాటు ఎలాంటి ఆహారం, నీరు లేకుండా ఆ బురద కూపంలోనే ఆమె ప్రాణాలు చేతిలో పెట్టుకుని గడిపారు.
Yusmarg Encounter | యూస్మార్గ్లో భద్రతా బలగాల ఆపరేషన్.. లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ మృతి
Nepal Flood Rescue | సాహసోపేత సహాయక చర్యలు..
సమాచారం అందుకున్న వెంటనే ‘ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్’ (APF) ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ బికె నేతృత్వంలోని రెస్క్యూ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. అత్యంత శ్రమకోర్చి భవనం పైఅంతస్తులోకి చేరుకున్న సిబ్బంది, అక్కడ స్పృహ లేని స్థితిలో పడి ఉన్న చండికా కుమారిని గుర్తించారు. చాకచక్యంగా వ్యవహరించి ఆమెను బురద నుంచి సురక్షితంగా వెలికితీశారు.
Nepal Flood Rescue | వైద్య సేవలు..
తీవ్ర నిర్జలీకరణ (Dehydration), బలహీనతతో ఉన్న ఆమెను తక్షణమే హెలికాప్టర్ ద్వారా త్రిశూలిలోని ‘మైథిలి బ్యారక్స్’కు తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
10 రోజుల పాటు బురదలో చిక్కుకుపోయి, 11వ రోజు కూడా ప్రాణాలతో బయటపడటంతో స్థానికులు, సహాయక సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపాల్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.