అక్షరటుడే వెబ్డెస్క్: Nepal Floods | నేపాల్ను అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ విపత్తులో మృతుల సంఖ్య 600 దాటగా, మరో 2,500 మందికి పైగా ఆచూకీ గల్లంతైంది. దీంతో సహాయక చర్యలతో పాటు మృతదేహాల భద్రత అధికారులకు అత్యంత క్లిష్టమైన సవాలుగా మారింది.
Nepal Floods | తాత్కాలిక ఏర్పాట్లు..
దేశవ్యాప్తంగా ఉన్న మార్చురీలన్నింటి సామర్థ్యం కేవలం 350 మృతదేహాలు మాత్రమే. కానీ మృతుల సంఖ్య ఇప్పటికే 600 దాటడంతో ఆసుపత్రులు, మార్చురీల్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. గల్లంతైన వారి బంధువులు వచ్చి గుర్తించే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల్లో ఉష్ణోగ్రత సుమారు 0 డిగ్రీల వద్ద ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.
Nepal Floods | మృతదేహాల గుర్తింపు ప్రక్రియ..
వెలికితీసిన మృతదేహాల క్లోజ్అప్ ఫొటోలు తీసి, బాడీ బ్యాగ్లకు ప్రత్యేక గుర్తింపు ట్యాగ్లను అమరుస్తున్నారు. ముఖం ద్వారా గుర్తుపట్టలేని మృతదేహాలకు వేలిముద్రలు, డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నారు. భవిష్యత్తులో శాస్త్రీయ పద్ధతిలో గుర్తించడానికి ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సెంటర్కు వచ్చే కుటుంబ సభ్యులకు ఫొటోలు చూపించి, వారు గుర్తించిన తర్వాత అధికారిక ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాలను వారికి అప్పగిస్తున్నారు. అలాగే 2021 నాటి నిబంధనల ప్రకారం, జిల్లా పోలీస్ చీఫ్ ఆధ్వర్యంలోని కమిటీలు స్థానిక అధికారుల సహకారంతో క్లెయిమ్ చేయని మృతదేహాలను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నాయి.
Nepal Floods | విదేశీ సహాయం అంగీకారం..
పరిస్థితి తీవ్రత దృష్ట్యా నేపాల్ ప్రభుత్వం విదేశీ సహాయాన్ని కోరింది. ఇందులో భాగంగా భారత్ ( India ), చైనా దేశాలకు చెందిన ప్రత్యేక సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలను సహాయక చర్యల కోసం అనుమతించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PG Medical Students | పీజీ వైద్య విద్యార్థుల డ్యూటీ వేళలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..