అక్షరటుడే వెబ్డెస్క్: Nepal Floods | నేపాల్ను మరోసారి వరద ముప్పు భయపెడుతోంది. దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రధాన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నేపాల్ వరద అంచనా విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం.. సున్ కోషి, బుధి గండకి, మహాకాళి నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయిని దాటాయి. లామ్జంగ్ జిల్లాలోని మార్శ్యాంగ్డి నదిలోనూ నీటి మట్టం హెచ్చరిక స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో మధ్య, పశ్చిమ, తూర్పు ప్రాంతాల ప్రజలకు అధికారులు అప్రమత్తత హెచ్చరికలు జారీ చేశారు. ముంపు ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ సూచించింది. ఎడతెగకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
Nepal Floods | భారీగా పెరిగిన ప్రాణనష్టం..
నేపాల్, టిబెట్ ( Tibet )ప్రాంతాలను అతలాకుతలం చేసిన వరదలు విపత్తుల కారణంగా మృతుల సంఖ్య 1,130కి చేరింది. ఇప్పటివరకు 1,113 మృతదేహాలకు చట్టపరమైన గుర్తింపు, పోస్ట్మార్టం ప్రక్రియలు పూర్తి కాగా.. కేవలం 95 పార్థివ శరీరాలను మాత్రమే బంధువులకు అందజేశారు. ఎలాంటి గుర్తింపు లభించని 911 మృతదేహాల వివరాలను అధికారులు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ విపత్తులో ఇప్పటివరకు 6,541 మందిని రక్షించగా, మరో 4,858 మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం సుమారు 7,912 మంది సిబ్బంది సహాయక గాలింపు చర్యల్లో నిమగ్నమై ఉన్నారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu Farmer Cases | రైతులు, ఉపాధ్యాయులపై కేసులు రద్దు : తమిళనాడు సీఎం