అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Oora Panduga | ఊరంత మెచ్చే పండుగకు కొన్ని గంటల సమయమే ఉంది.. అమ్మలను కొలిచేందుకు ఇందూరు (Nizamabad) ప్రజలు సిద్ధమయ్యారు. కులమతాలకు అతీతంగా నగరంలో ప్రతిఏటా నిర్వహించే ఊర పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. నగరంలో ప్రతిఏటా భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ సంబరానికి పోలీసుల, మున్సిపల్ కార్పొరేషన్ శాఖలు సిద్ధమయ్యాయి.
Nizamabad Oora Panduga | ఆనవాయితీగా వస్తున్న పండుగ
జిల్లా కేంద్రంలో ఆషాఢమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఊరపండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దశాబ్దాల క్రితం నగరంలో ప్రజలకు కలరా, గత్తర, ప్లేగు వ్యాధులు ప్రబలాయని.. ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని.. గ్రామ దేవతలు ఆగ్రహించడం వల్లే ఇలా జరిగిందని భావించిన గ్రామ పెద్దలు.. అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్టించాలని నిర్ణయించినట్లుగా పెద్దలు చెబుతారు. ఊర పండుగ నిర్వహించడం వల్ల వ్యాధులు తగ్గుముఖం పట్టాయని పేర్కొంటున్నారు. అప్పటినుంచి ప్రతిఏటా భక్తిశ్రద్ధలతో ఊరపండుగను నిర్వహిస్తున్నారు.
Nizamabad Oora Panduga | ఒకే మామిడి చెట్టు నుంచి 14 దేవతామూర్తుల తయారీ..

ఊర పండుగ సందర్భంగా 14 అమ్మవార్ల ప్రతిమలను తయారుచేస్తారు. ఒకే మామిడి చెట్టు నుంచి సేకరించిన కర్రలతో వీటిని తయారు చేస్తారు. పౌవుడాలమ్మ, ఐదు చేతుల పోచమ్మ, మహా లక్ష్మమ్మ, అడెల్లి పోచమ్మ, ఇద్దరు సార్గమ్మలు, అత్తరు పోశవ్వ, కొండల రాయుడు, బోగంసాని, ఆసు, రాట్నం, అంపుడు పోశవ్వ ఇలా మొత్తం 14 దేవతా మూర్తులను తయారుచేస్తారు. శనివారం సాయంత్రం వడ్లధాతిలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఖిల్లా శారదాంబ గద్దె వద్ద ప్రతిష్టిస్తారు. అక్కడి నుంచి ఉదయం ఊరేగింపు ప్రారంభమమవుతుంది.
Nizamabad Oora Panduga | ‘సరి’కి ప్రత్యేకం..
నవధాన్యాలు, పిండితో కలిపి ప్రత్యేకంగా ఈ సరిని తయారు చేస్తారు. ఇందులో గ్రామదేవతలకు బలిచ్చే జీవాల రక్తం, పేగులను కలుపుతారు. ఈ సరిని ఇళ్లపై, పాడిపశువులపై చల్లితే అనారోగ్యాలు దరిచేరమని నగరవాసుల అపార నమ్మకం. దీంతో ఈ సరిని దక్కించుకునేందుకు ప్రజలు తరలివస్తారు.
Nizamabad Oora Panduga | ఏర్పాట్లు పూర్తి చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్..
ఏడాదికి ఒకసారి నిర్వహించే ఊర పండుగకు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఖిల్లా శారదాంబ గద్దె నుంచి వివేకానంద చౌరస్తా, లక్ష్మీ మెడికల్ చౌరస్తా, గోల్ హనుమాన్ చౌరస్తా, వినాయక్నగర్, మహాలక్ష్మి నగర్, దుబ్బ తదితర ప్రాంతాల్లో పరిసరాలను, రోడ్లను శుభ్రం చేశారు. ఈ మార్గాల్లో మున్సిపల్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.
Nizamabad Oora Panduga | పోలీసు శాఖ సర్వసన్నద్ధం..
ఊర పండుగలో పోలీసు శాఖకు ప్రత్యేక స్థానం ఉంది. దేవతామూర్తులను తీసుకెళ్లే దారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో సిబ్బందిని ఇప్పటికే నియమించారు. ప్రధాన ప్రాంతాల్లో వీరంతా భద్రత ఏర్పాట్లలో నిమగ్నమవుతారు. అలాగే దేవతామూర్తులను తీసుకెళ్లే వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రోప్పార్టీ ఏర్పాటుచేశారు. ‘సరి’ కోసం తోపులాట జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు ఈ విషయమై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Nizamabad Oora Panduga | అన్ని కుల సంఘాల సమన్వయంతో నిర్వహణ
నగరంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఊరపండుగకు అన్నికుల సంఘాల సమన్వయంతో సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. ఆయా కులసంఘాల పెద్దకాపులు, పెద్దమనుషులు, సర్వసమాజ్ కమిటీ సభ్యులు సహకరిస్తున్నారు. అలాగే రెవెన్యూ, మున్సిపల్, పోలీసు యంత్రాంగాలు ఊర పండుగ విజయవంతం కావడానికి శ్రద్ధతో పనిచేస్తున్నాయి. వారికి కృతజ్ఞతలు. నగర ప్రజలపై ఎలాంటి దుష్టశక్తులు పనిచేయకుండా.. అమ్మవార్ల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలి. భక్తులు పెద్ద ఎత్తున ఊర పండుగ యాత్రలో పాల్గొనాలి.
– ఆదె ప్రవీణ్కుమార్, కో–కన్వీనర్, సర్వ సమాజ్ కమిటీ
Nizamabad Oora Panduga | ప్రజలు ఊరపండుగను విజయవంతం చేయాలి
బండారు పోయడంతో ఊర పండుగ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో నగరంలో వ్యాధులు ప్రబలడంతో గ్రామపెద్దలు గ్రామదేవతలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పండుగ చేశారు. అప్పటినుంచి క్రమం తప్పకుండా నగరంలో ఊర పండుగ జరుగుతోంది. ప్రజలంతా స్వయం నియంత్రణ పాటిస్తూ ఊరేగింపులో పాల్గొనాలి. పండుగ నిర్వహణకు సహకరిస్తున్న పోలీసు,రెవెన్యూ, బల్దియా యంత్రాంగానికి కృతజ్ఞతలు.
– గాండ్ల లింగం, కమిటీ మెంబర్, సర్వ సమాజ్ కమిటీ
ఇది కూడా చదవండి..: Navipet Railway Gate | నవీపేట్ రైల్వేగేట్ వద్ద గుంతల పూడ్చివేత.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందన