అక్షరటుడే, కామారెడ్డి: Party Discipline | క్రమశిక్షణను ఉల్లంఘించే వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తాయని, నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కామారెడ్డి(Kamareddy) కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఐరేని సందీప్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కాంగ్రెస్(kamareddy congress,) పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
Party Discipline | మహిళలను పార్టీ గౌరవిస్తుంది
కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తుందని సందీప్ స్పష్టం చేశారు. ఆన్లైన్ పత్రికల్లో ప్రచురితమైన వార్త కథనాలను కాంగ్రెస్ పార్టీ తరపున, పట్టణ అధ్యక్షుడిగా తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖను కోరారు. మహిళలకు గౌరవం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు. ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో ఆ నాయకుడే గడ్డం ఇందుప్రియను అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారన్నారు. మహిళగా గౌరవించి మున్సిపల్ ఛైర్పర్సన్గా నియమించి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ నాయకునిపైనే ఆధారాలు లేని ఆరోపణలు చేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
Party Discipline | ఆరోపణలు చేయడం అనుచితం..
రాష్ట్రంలో ఎక్కడో ప్రచురితమైన వార్తలను, వ్యక్తిగత అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని కామారెడ్డి కాంగ్రెస్ నాయకులపై మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ ఆరోపణలు చేయడం పూర్తిగా అనుచితమన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ద్వారా పార్టీ నాయకత్వం, కార్యకర్తల మనోభావాలను దెబ్బతీయడం జరుగుతోందని, ఇటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ నియమావళికి విరుద్ధమని స్పష్టం చేశారు. స్వలాభం కోసం, రాజకీయంగా ఎదగడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులపై, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) పేర్లను వాడుకొని బహిరంగంగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత విచారకరమన్నారు.
పార్టీలో విభేదాలు, ఫిర్యాదులు, అభ్యంతరాలు ఉంటే వాటిని పార్టీ రాజ్యాంగం ప్రకారం సంబంధిత కమిటీల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు వారి కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు పరిశీలనలో ఉండగా, వాటిని మీడియా ముందుకు తీసుకువచ్చి వ్యాఖ్యలు చేయడం పార్టీ నిర్ణయాలను, వ్యవస్థను, క్రమశిక్షణను ధిక్కరించడమేననన్నారు. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు, కార్యక్రమాలు ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా లాభం చేకూర్చే విధంగా ఉండటం వల్ల, బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతోందని విమర్శించారు.
Party Discipline | పార్టీని బలహీనపర్చే యత్నం
ఆమె వ్యవహారశైలి కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చే ప్రయత్నంగా కనిపిస్తోందని పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఐరేని సందీప్ తెలిపారు. ఆమె వ్యాఖ్యలు, చర్యలపై సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీని కోరనున్నామని, అవసరమైతే అధికారికంగా ఫిర్యాదు కూడా సమర్పిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు భూమని బాలరాజ్, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రెడ్డి నాయక్, పట్టణ మహిళా అధ్యక్షురాలు సుమప్రియ, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, మీసాల రమేష్, హనుమాండ్ల రవి, భరత్ టింకు, రవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడాచదవండి: KTR Congress Allegations | మీనాక్షి నటరాజన్ ఓటమి వెనుక కాంగ్రెస్ కుట్ర: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
