అక్షరటుడే,అమరావతి: Pithapuram Row | కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురంలో చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలు కూటమిలో కలకలం రేపాయి. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఫొటో లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడం, అది ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
Pithapuram Row | ప్రొటోకాల్ వివాదంపై ఆగ్రహం..
ఈ వివాదం తన దృష్టికి రావడంతో చంద్రబాబు నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas)తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫొటోలు, ప్రొటోకాల్ అంశాలను సాకుగా చూపి కూటమి నేతల మధ్య బహిరంగంగా ఘర్షణలు పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని సీఎం స్పష్టం చేశారు.
Pithapuram Row | పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది..
ఫ్లెక్సీల విషయంలో ఏదైనా లోపం జరిగితే దానిని పార్టీ పెద్దలకో లేదా ప్రభుత్వం దృష్టికో తీసుకురావాలి తప్ప, రోడ్డు మీద గొడవలు చేయడం వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు క్షేత్రస్థాయిలోని కార్యకర్తలకు తప్పుడు సందేశాన్ని పంపుతాయని, కూటమి ఐక్యతకు భంగం కలిగించే పనులు చేయవద్దని సూచించారు.

Pithapuram Row | వర్మకు గట్టిగా నచ్చజెప్పాలి:
భవిష్యత్తులో ఇలాంటి గొడవలు జరగకుండా చూడాలని పల్లా శ్రీనివాస్ను ఆదేశిస్తూనే, మాజీ ఎమ్మెల్యే వర్మకు గట్టిగా నచ్చజెప్పాలని సీఎం సూచించారు. పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, అక్కడ ఇరు పార్టీల నేతల మధ్య సమన్వయం ఉండాలని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి..: Nadendla Bhaskara Rao | మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

