అక్షరటుడే, వెబ్డెస్క్: Rahul Gandhi FIR Demand | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత, ఆ స్థలాన్ని ‘శుద్ధి’ చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో శనివారం రాహుల్ గాంధీ మాట్లాడారు. ఖర్గే (Mallikarjuna Kharge) మాట్లాడిన స్థలాన్ని శుద్ధి చేయడాన్ని రాజ్యాంగం, ఆర్ఎస్ఎస్-బీజేపీ భావజాలాల మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. తన పార్టీ అధ్యక్షుడికి న్యాయం జరగాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించిన వారిపై వీలైనంత త్వరగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు.
Rahul Gandhi FIR Demand | ప్రధాని మాట్లాడాలి
తాను అన్ని కులాలకు చెందినవాడినని ప్రధాని చెబుతారని రాహుల్ అన్నారు. కానీ ఉత్తరాఖండ్లో బీజేపీ చీఫ్ మాత్రం ఆ ‘శుద్ధి’ చర్య సరైనదేనని సమర్థించారని మండిపడ్డారు. ఇది బీజేపీ, ఆర్ఎస్ఎస్ మనస్తత్వాన్ని బయటపెడుతోందన్నారు. ఒక దళితుడు ఆర్థికంగా ఎదగడం, గౌరవప్రదంగా జీవించడం వారికి ఇష్టం లేదన్నారు. ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు ఆ కార్యక్రమాన్ని సమర్థించి, చట్టవిరుద్ధమైన పని చేసినా.. ప్రధాని మాట్లాడకపోవడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ఒక ఆలయాన్ని సందర్శించిన తర్వాత కూడా ఇలాంటి ‘శుద్ధి’ కార్యక్రమం జరిగిందని ఆరోపించారు.
ఇది కూడా చదవండి..: FDA Food Check | లంచం ఆరోపణలు.. ఎఫ్డీఏ అధికారికి ఎక్స్పైరీ బిస్కెట్లు తినిపించే యత్నం