అక్షరటుడే, ఇందూరు: School Admissions | నిజామాబాద్ జిల్లాలో కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. హైదరాబాద్లోని తమ కార్పొరేట్ బ్రాంచ్ల పేరిట స్థానికంగా భవనాలు నెలకొల్పి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు చేపడుతున్నాయి.
జిల్లాలో వందల సంఖ్యలో పాఠశాలలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు అనుమతులు తీసుకుంటున్నా.. మరికొన్ని అవేమీ లేకుండానే అడ్మిషన్లు చేపడుతున్నాయి. నగర శివార్లలో కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల పేరిట స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో కొన్నింటికి అనుమతులు లేవు. అయినా కూడా యథేచ్ఛగా అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. పరిష్మన్ లేకుండా ఒక పాఠశాలలో ఒక్కో అడ్మిషన్ కోసం రూ. 1.80 లక్షలు వసూలు చేస్తున్నారు. సదరు పాఠశాలపై విద్యార్థి సంఘాలు డీఈవోకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. జీవో ms no 1 ప్రకారం గుర్తింపు లేకుండా అడ్మిషన్లు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యారు.
School Admissions | నిబంధనలు బేఖాతర్
ప్రైవేటు స్కూల్ ఏర్పాటు చేయాలంటే విద్యాశాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. నూతన పాఠశాల ఏర్పాటుతో పాటు రెన్యూవల్ కోసం అక్టోబర్లోనే చలాన్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కొన్ని సూళ్లు ఇంకా చలాన్ కూడా కట్టలేదు. కనీస నిబంధనలు పాటించకుండానే జోరుగా అడ్మిషన్లు తీసుకుంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించేందుకు పెద్దపెద్ద హోర్డింగ్లు, అడ్వర్జైజ్మెంట్లు ఇస్తున్నారు. వీటిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోతూ పాఠశాలలకు గుర్తింపు లేదనే విషయం తెలుసుకోకుండానే తమ పిల్లలను చేర్పిస్తున్నారు.
School Admissions | ఆందోళనకు సిద్ధమవుతున్న విద్యార్థి సంఘాలు
జిల్లాలో పర్మిషన్లు లేకుండా ఏర్పాటవుతున్న కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలల విషయంలో విద్యార్థి సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ఓ విద్యాసంస్థ అమనుతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతుండడంతో ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రైవేటు స్కూళ్లలో పుస్తకాలు, నోటుబుక్కుల అమ్మకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపడుతున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని చెబుతున్నారు.
School Admissions | ప్రకటనలకే పరిమితం
అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. జిల్లాలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యలు ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ గుర్తింపు పొందకుండానే కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ల పేరిట ప్రవేశాలు పొందుతున్నాయని పేర్కొంది. సదరు పాఠశాలలు కనీసం ప్రభుత్వ గుర్తింపు కోసం ప్రపోజల్స్ సమర్పించలేదని తెలిపింది. ఇలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి నోటీసు లేకుండా మూసివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, యూనిఫారం, షూస్, ఇతర స్టేషనరీ అమ్మకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..: Sainik School Selection | సైనిక్ స్కూల్కు ఆటో డ్రైవర్ కుమార్తె ఎంపిక..