అక్షరటుడే వెబ్డెస్క్: Sikkim Tunnel Collapse | సిక్కింలోని నామ్చి జిల్లాలో సంభవించిన ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. జోలుంగేలోని సమర్దుంగ్ వద్ద ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ VI ( NHPC Teesta Stage VI )జలవిద్యుత్ ప్రాజెక్ట్కు సంబంధించిన నిర్మాణంలో ఉన్న సొరంగం కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయినట్లు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ మంగళవారం వెల్లడించారు.
Sikkim Tunnel Collapse | ప్రమాదం జరిగిందిలా..
సోమవారం మధ్యాహ్నం భారీ కొండచరియలు విరిగిపడటంతో సొరంగం ప్రవేశద్వారం పూర్తిగా మూసుకుపోయింది. ఈ ప్రమాదం సమయంలో లోపల సుమారు 27 మంది కార్మికులు చిక్కుకుపోయారు. దీనికి తోడు సొరంగంలో గ్యాస్ లీకై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. భూగర్భ పొరలు లేదా రాతి నిర్మాణాలు కదలడం వల్లే ఈ వాయువు వెలువడి ఉంటుందని భావిస్తున్నారు.
Sikkim Tunnel Collapse | సహాయక చర్యల్లో ఇబ్బందులు ..
సొరంగం లోపల గ్యాస్ నిండిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లిన సిబ్బందిలో పలువురు తలతిరగడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యల బారిన పడ్డారు. అయినప్పటికీ శ్రమించి అధికారులు ఇప్పటివరకు 16 మంది కార్మికులను సురక్షితంగా రక్షించారు.
Sikkim Tunnel Collapse | ప్రధానమంత్రి దిగ్భ్రాంతి..
ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సిక్కిం ముఖ్యమంత్రితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు సీఎం తమాంగ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఇది కూడా చదవండి: SBI Funds IPO | నిరాశపరిచిన ‘ఎస్బీఐ ఫండ్స్’.. స్వల్ప లాభాలతో లిస్టింగ్