అక్షరటుడే, వెబ్డెస్క్ : Singareni Mines Visit | సింగరేణిలో దోపిడీదారులకు తావులేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. రాబంధుల దృష్టి సింగరేణిపై పడనీయం అని పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu)తో కలిసి ఆయన ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని పరిశీలించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. కార్మికుల కష్టాన్ని అవమానించే ఏ చర్యనూ సహించబోమని స్పష్టం చేశారు. నిజానిజాలను వెల్లడించడానికి ఈ ఓపెన్-హౌస్ తనిఖీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకులు తమ వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Singareni Mines Visit | కార్మికుల కృషితో..

సింగరేణి అభివృద్ధి, విజయాలు కార్మికుల కృషిపైనే ఆధారపడి ఉన్నాయని భట్టి తెలిపారు. వారి గౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నీ సహించబోమన్నారు. సింగరేణి యాజమాన్యం చిత్తశుద్ధిని, సంస్థ అనుసరిస్తున్న పారదర్శక విధానాలను తప్పుపడుతూ ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని తెలంగాణ ప్రజల ఆస్తి అని పేర్కొన్నారు. దోపిడీదారులు, అవకాశవాదుల కన్ను సింగరేణిపై పడకుండా ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
Singareni Mines Visit | పారదర్శకంగా..
బొగ్గు ఉత్పత్తి, నిల్వల నిర్వహణ, రవాణా ప్రక్రియలలో పూర్తి పారదర్శకతను పాటిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఆయన గని పరిసరాలు, భద్రతా చర్యలు, రవాణా రికార్డులను పరిశీలించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో నిర్దేశిత లక్ష్యాల ప్రకారం మరో 28 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తిని కొనసాగించడానికి సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వారికి ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు, వారి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు.
దీనిని కూడా చదవండి : Shabbir Audio | వైరల్ అయిన ఆడియో క్లిప్ నకిలీది..: క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్ అలీ వివరణ