అక్షరటుడే, మెండోరా: Sriramsagar Flood | స్థానికంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో శ్రీరాంసాగర్ (పోచంపాడ్) ప్రాజెక్టు (Sriramsagar Project) నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Sriramsagar Flood | 10,540 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 10,540 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,075.00 అడుగుల వద్ద 32.897 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 39.447 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతం సుమారు 6 టీఎంసీల మేర తక్కువగా ఉంది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 383 క్యూసెక్కులు కలిపి మొత్తం 914 క్యూసెక్కులు పోతుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతుండటంతో శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టులోకి వచ్చే వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.