అందోల్: హైదరాబాద్లో జూన్ 8 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన ‘అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (AKFI) జాతీయ న్యాయ నిర్ణేత పరీక్షలో సంగారెడ్డి జిల్లా అందోల్ పట్టణానికి చెందిన ఎంపీఈడీ వ్యాయామ ఉపాధ్యాయుడు (PET) తరుణ్ రాజ్ ఉత్తీర్ణత సాధించారు. ఈ విజయంతో ఆయన జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతగా అర్హత పొందారు.
వెలువెత్తిన అభినందనలు..
కబడ్డీ క్రీడలో కోచ్గా సేవలందిస్తూ, తాజాగా జాతీయ స్థాయి రిఫరీగా అర్హత సాధించడం పట్ల అందోల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ, జిల్లా క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు , ఎంజేపీ ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు. తరుణ్ రాజ్ భవిష్యత్తులో ప్రో కబడ్డీ లీగ్ (PKL) , అంతర్జాతీయ వేదికలపై కూడా రాణించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తరుణ్ రాజ్ మాట్లాడుతూ.. తనకు వెన్నుదన్నుగా నిలిచిన సంగారెడ్డి కబడ్డీ అసోసియేషన్ , తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నుంచి జాతీయ స్థాయి కబడ్డీ న్యాయ నిర్ణేతగా ఎంపిక కావడం జిల్లా క్రీడా రంగ చరిత్రలో గర్వకారణమని పలువురు ప్రముఖులు కొనియాడారు.