అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కొద్దిసేపటికే, మంత్రి కొండా సురేఖ కూడా హస్తినకు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం, పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Telangana Congress | పర్యటనపై సర్వత్రా ఆసక్తి..
మంత్రి కొండా సురేఖ కూతురు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సురేఖతో పాటు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీకి నివేదిక సమర్పించింది. ఈ పరిణామాల మధ్య కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెను అధిష్టానం పిలిచిందా లేక స్వయంగా వెళ్లారా అనేదానిపై స్పష్టత లేనప్పటికీ, తనపై వస్తున్న ఆరోపణలపై ఆమె హైకమాండ్కు వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
Telangana Congress | అధిష్టానం నిర్ణయంపై ఉత్కంఠ..
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ హైకమాండ్ కఠిన నిర్ణయం తీసుకుంటే మంత్రి పదవికి సురేఖ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం మందలించి సరిపెడతారా లేక వేరే నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
Telangana Congress | కేబినెట్ విస్తరణపై చర్చ?
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలు ఢిల్లీలో ఉండటంతో కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాల భర్తీ, కొత్త మంత్రుల ఎంపికపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Eatala Rajender | రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు : ఎంపీ ఈటల