అక్షరటుడే, తెయూ క్యాంపస్: TU Recruitment | తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) 2012లో అధ్యాపకుల నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని డాక్టర్ అంగోతు వెంకట్ నాయక్ ఆరోపించారు. ఆ మేరకు తెయూ వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం డిచ్పల్లిలో (Dichpally) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
TU Recruitment | 2012లో నియామక ప్రక్రియ..
2012 ఏడాది నియామక ప్రక్రియ ద్వారా 2014లో అధ్యాపకులు నియామకమయ్యారని.. ఈ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ నియామక ప్రక్రియ తప్పని రుజువు చేస్తూ గత అక్టోబర్ నెలలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. కానీ తెయూలో ఇప్పటి వరకు పాలకమండలి సమావేశం నిర్వహించకుండా, అక్రమ నియామకాలు పొందిన ఉద్యోగులను తొలగించకుండా తాత్సారం చేయడం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 నెలలు గడిచినా ఉద్యోగుల తొలగింపులో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు.
TU Recruitment | కోర్టు తీర్పును లెక్క చేయకుండా..
అక్రమ నియమకాలు పొందిన అధ్యాపకులు యూనివర్సిటీకి ఇచ్చిన అండర్ టేకింగ్ పత్రాలను సైతం లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. తమ లాంటి నిరుద్యోగులు 12ఏళ్లు న్యాయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కోర్టు తీర్పును సైతం యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2012లో నియామకాల్లో రోస్టర్ పాయింట్లు కేటాయించడంపై అనేక అవకతవకలకు పాల్పడ్డారని.. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో తెయూపై పిటిషన్ దాఖలు చేశామన్నారు. అనంతరం ప్రభుత్వం సైతం ద్విసభ్య కమిటీ, రిటైర్డ్ జడ్జి సీవీ రాములు కమిటీల ద్వారా నిజనిర్ధారణ చేసి యూనివర్సిటీలో జరిగిన నియామక ప్రక్రియలో తప్పిదాలు జరిగినట్లు గుర్తించాయని తెలిపారు. 2014 జనవరిలో అక్రమంగా నియామకమైన అధ్యాపకులు షరతులతో కూడిన బాండ్ పేపర్పై అండర్ టేకింగ్ తీసుకొని ఉద్యోగాల్లో చేరి, మళ్లీ ఇప్పుడు అదే ధోరణిలో షరతులకు లోబడి పదోన్నతులు కల్పించాలంటూ అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
TU Recruitment | 12ఏళ్లుగా అన్యాయానికి..
12 ఏళ్లుగా తాము అన్యాయానికి గురై నూతన నియామక ప్రక్రియ కోసం ఎదురుచూస్తుంటే.. తెయూ అధికారులు ఇంకా తాత్సారం చేయడం సబబుగా కాదన్నారు. అత్యవసరంగా పాలకమండలి సమావేశం ఏర్పాటు చేసి 2012 నియామకపు నోటిఫికేషన్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని, తమకు న్యాయం చేయాలని వీసీని కోరినట్లు తెలిపారు. అక్రమ నియామకాలు పొందిన అధ్యాపకుల విషయంలో ఉన్నతాధికారులు జాగ్రతగా వ్యవహరించాలని, పదోన్నతులు కల్పించవద్దని, తనతో పాటు ఇతర నిరుద్యోగులకు న్యాయం చేయాలని విన్నవించినట్లు పేర్కొన్నారు. హై కోర్టు తీర్పును గౌరవించి పాలకమండలిలో చర్చించాలని సూచించారు.

ఇది కూడా చదవండి : Hyderabad Division Increase | హైదరాబాద్లో పెరగనున్న డివిజన్లు