అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Heavy Rain | ఎల్లారెడ్డి (Yellareddy) మండలంలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న ధాన్యం కుప్పలు (paddy crop) తడిసి ముద్దయ్యాయి. ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు సైతం ఈదురు గాలులకు ఎగిరిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. చేతికందిన పంట నీటిపాలవడంతో కన్నీరు పెడుతున్నారు.
Yellareddy Heavy Rain | భారీ ఈదురుగాలులు
బలంగా వీచిన ఈదురుగాలుల ధాటికి ఎల్లారెడ్డి–కామారెడ్డి (Yellareddy-kamareddy) ప్రధాన రహదారిపై అనేక చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు, ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రోడ్డుపై భారీగా కొమ్మలు పడడంతో రాకపోకలు స్తంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై పడిన చెట్లకొమ్మలు తొలగించాలని వారు కోరుతున్నారు. ఈదురు గాలులకు గండి మాసానిపేట్ గ్రామంలో విద్యుత్ తీగలు తెగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ తీగలను పునరుద్ధరించి కరెంటు సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పలుచోట్ల రేకుల షెడ్లు సైతం ధ్వంసమయ్యాయి.
Yellareddy Heavy Rain | తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణశాఖ మరో రెండు రోజులు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపై పడిన కొమ్మలను పూర్తిగా తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



