అక్షరటుడే, నిజమాబాద్ టౌన్: Young India Schools | యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ (Integrated Residential Schools) స్కూల్, వసతి గృహ సముదాయాలను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు. బాన్సువాడ (Banswada) అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోతంగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్నస్కూల్ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు.
Young India Schools | అన్ని సౌకర్యాలతో..
అకడమిక్, అడ్మిన్ బ్లాక్లు, డార్మెటరీ, కిచెన్, డైనింగ్, ఇండోర్ గేమ్స్, క్రికెట్ గ్రౌండ్, ప్లే గ్రౌండ్, టీచర్స్ క్వార్టర్స్, సెక్యూరిటీ బ్లాక్, పార్కింగ్ తదితర నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల వివరాలు ఆరా తీశారు. మైల్స్టోన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. నిర్దేశిత సమయం లోపు పనులన్నీ పూర్తయ్యేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలని టీజీఈడబ్ల్యూఐడీసీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అధునాతన వసతి, సదుపాయాలతో సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తోందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు.
Young India Schools | వసతులు కల్పించాలి
ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో సుమారు 2,500 మంది పైచిలుకు విద్యార్థులు, 300మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది ఉంటారని, వీరి అవసరాలకు సరిపడా మంచినీరు, డ్రైనేజీ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, నాణ్యతా లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్మాణ పనులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ కొడిచెర్ల ఇసుక క్వారీని సందర్శించారు. క్వారీలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలను పరిశీలించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం నిబంధనలను అనుసరిస్తూ ఈ క్వారీ ద్వారా ఇసుకను అందించాలని అధికారులను ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా గట్టి నిఘా ఉంచాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరపాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీవో విజయ కుమారి, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Kavitha CBI Probe | అఫిడవిట్ కంటే ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రాసిస్తా: సీఎం రేవంత్కు కవిత సవాల్