అక్షరటుడే, వెబ్డెస్క్ : 22A Prohibited List | రాష్ట్రంలో 22ఏ నిషేధిత జాబితా పేరుతో భూములు కబ్జా చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఇళ్లను కూడా ఈ జాబితాలో చేర్చడం దుర్మార్గం అన్నారు.
బోడుప్పల్ పరిధిలోని తిరుమల మెడోస్, లక్ష్మీ గణపతి కాలనీ, హేమానగర్ కాలనీలకు చెందిన పలువురు 22A బాధితులు శనివారం హరీశ్రావు (Harish Rao) ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ఎలాంటి వివాదాలు లేకుండా సుమారు 1,500 కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లను రాత్రికి రాత్రే కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద 22A నిషేధిత జాబితాలో చేర్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఇల్లు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయిందని బాధితులు వాపోయారు.
22A Prohibited List | కమీషన్ల సర్కార్
చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన ఇళ్లను అడ్డుపెట్టుకుని ప్రజలపై ఒత్తిడి తెచ్చి 30 శాతం కమీషన్లు దండుకునేందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. దశాబ్దాలుగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకు ఇప్పుడు 22A భయం చూపిస్తూ, బినామీలతో సెటిల్మెంట్లు చేసుకునే దందాకు తెరలేపారని విమర్శించారు. ఈ సర్కార్ మెడలు వంచైనా సరే ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందన్నారు. తక్షణమే ఆయా కాలనీలను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Srisailam Project | శ్రీశైలం ప్రాజెక్టులో తగ్గుతున్న నీటిమట్టం