అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad Collector | సంక్షేమ పథకాలపై (Welfare Schemes) ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకే ప్రభుత్వం పంచాయతీల్లో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను నిర్వహిస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. వర్ని మండలం హుమ్నాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం సర్పంచ్ అప్పిరెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
Nizamabad Collector | వ్యవసాయరంగంలో జిల్లాకు అరుదైన ఘనత..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లా అరుదైన ఘనతను కలిగి ఉందని కలెక్టర్ గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి విధానాన్ని అవలంభిస్తూ సాగు రంగంలో ప్రత్యేకతను చాటాలని రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున, తక్కువ సాగు నీటి అవసరం కలిగిన పంటలను విత్తుకోవాలని సూచించారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ఆయా పంట రకాలనే సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నకిలీ, నాసిరకం విత్తనాలను విక్రయించే డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని, అర్హులైన రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ దోహదపడుతుందని తెలిపారు.
Nizamabad Collector | తాగునీటి ఇబ్బందులు తొలగించేందుకు..

వర్షాభావ పరిస్థితులు తలెత్తినా కూడా బోధన్, నిజామాబాద్ పట్టణాలు, నిర్దేశిత గ్రామాలకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే రానున్న రెండు రోజులలో నిజాంసాగర్ నీటిని విడుదల చేయించి, బెల్లాల్ చెరువులోకి మళ్లించడం జరుగుతుందన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని, పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈగలు, దోమల వ్యాప్తిని నివారించవచ్చని, తద్వారా వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను గ్రామ పంచాయతీలు (Rural Development) తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలను వేర్వేరుగా సేకరించాలన్నారు.
Nizamabad Collector | పంటల మార్పిడి.. సరైన మోతాదులో ఎరువులు..
పంటల మార్పిడి, సరైన మోతాదులో ఎరువుల వినియోగం, రక్షిత మంచినీటి సరఫరా, వర్షపు నీటిని ఓడిసిపట్టడం, భూగర్భ జలాల సంరక్షణ, విరివిగా మొక్కల పెంపకంపై గ్రామ సభల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం గురించి ప్రజలకు సులభంగా అర్ధమయ్యే రీతిలో బోర్డుపై ముఖ్యమైన తేదీలు, ఇతర వివరాలను కలెక్టర్ రాస్తూ అవగాహన కల్పించారు. జూన్ 25 నుంచి బీఎల్వోలు ఇంటింటికి తిరుగుతూ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తారని, వారికి సహకరించాలని ప్రజలను కోరారు. ప్రతిఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మహిళలు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకుంటూ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ హితవు పలికారు. గ్రామ సభలో బోధన్ ఆర్డీవో విజయలక్ష్మి, మండల ప్రత్యేక అధికారి మధుసూదన్, ఏసీపీ శ్రీనివాస్, డీఎల్పీవో శ్రీనివాస్, తహశీల్దార్ ప్రశాంత్, స్థానిక అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
