అరటుడే వెబ్డెస్క్: Zepto IPO ED Notice | భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న క్విక్ కామర్స్ సంస్థ ‘జెప్టో’ (Zepto) చుట్టూ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్వరలోనే స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు ఐపీవో (IPO) కి సిద్ధమవుతున్న ఈ కంపెనీ వ్యవస్థాపకులు అదిత్ పలిచా, కౌవల్య వోహ్రాలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. అయితే, ఈ విషయాన్ని దాచకుండా కంపెనీ తన రెగ్యులేటరీ డిస్క్లోజర్లో భాగంగా ఐపీవో ఫైలింగ్ పత్రాల్లోనే అధికారికంగా వెల్లడించడం విశేషం.
Zepto IPO ED Notice | వివరాలు కోరిన ఈడీ..
జెప్టో సంస్థ గతంలో వివిధ విడతల్లో సేకరించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI), కంపెనీ నిర్వహించిన నిధుల సేకరణ (Funding Rounds), అంతర్గత ఆర్థిక లావాదేవీలతో పాటు కంపెనీ కార్పొరేట్ నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిందిగా ఈడీ కోరినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థ జారీ చేసిన సమన్లకు జెప్టో ఫౌండర్లు సానుకూలంగా స్పందించారు. ఈ విచారణకు పూర్తిగా సహకరిస్తూ, అధికారులు కోరిన అన్ని రకాల ఆర్థిక పత్రాలు, అవసరమైన ఆధారాలను ఇప్పటికే సమర్పించినట్లు కంపెనీ తన ఐపీవో పత్రాల్లో స్పష్టం చేసింది.

Zepto IPO ED Notice | మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ..
దేశీయ మార్కెట్లో బ్లింకిట్, ఇన్స్టామార్ట్ వంటి దిగ్గజ సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ జెప్టో దూసుకుపోతోంది. మార్కెట్ నుంచి భారీగా నిధులు సేకరించడమే లక్ష్యంగా ఐపీవో ప్రక్రియను ప్రారంభించిన కీలక తరుణంలోనే ఈ ఈడీ సమన్ల వ్యవహారం వెలుగుచూడటం గమనార్హం. అయినప్పటికీ, కంపెనీ ఈ విషయాన్ని దాచకుండా ముందే పారదర్శకంగా ఇన్వెస్టర్ల ముందుకు ఉంచింది. దీంతో మార్కెట్ వర్గాలు, ఇన్వెస్టర్లు దీనిని ఒక సాధారణ రెగ్యులేటరీ ప్రక్రియగా భావిస్తారా? లేక రాబోయే ఐపీవోపై ఇది ఏమైనా ప్రభావం చూపుతుందా? అనేది ఇప్పుడు బిజినెస్ రంగంలో హాట్ టాపిక్గా మారింది.
ఇది కూడా చదవండి: Locker Theft | నగరంలో దొంగల హల్చల్.. లాకర్తో పరారు
