అక్షరటుడే, కామారెడ్డి: Rajya Sabha Nomination Row | మొన్నటి వరకు ఓట్లను చోరీ చేసిన బీజేపీ, ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సీట్లను కూడా చోరీచేసే స్థాయికి చేరుకుందని డీసీసీ జిల్లా అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ను తిరస్కరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Rajya Sabha Nomination Row | ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి
దీన్ని ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న బీజేపీ (BJP) ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలను వరుసగా కొనసాగిస్తోందన్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటన బీజేపీ రాజకీయ కుట్రలకు పరాకాష్టగా నిలిచిందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించడం, దొంగ ఓట్లను నమోదు చేయడం, ప్రజాప్రతినిధులను అక్రమంగా చేర్చుకోవడం బీజేపీ రాజకీయాల్లో సాధారణమైందని మండిపడ్డారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
Rajya Sabha Nomination Row | పోరాటం చేస్తాం

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారతదేశంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ పరిరక్షకులు, సామాజిక సంస్థలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కులను హరించే, రాజ్యాంగ వ్యవస్థను బలహీనపర్చే ప్రతి ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకువెళ్తుందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని బతికించేందుకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశంపై బీజేపీ, ఎన్నికల కమిషన్పై కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం కూడా కొనసాగిస్తుందన్నారు.
ఇది కూడా చదవండి..: Jakora Chandur Lift Irrigation | జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్
