అక్షరటుడే, బాన్సువాడ: Jakora Chandur Lift Irrigation | వర్ని మండలం (Varni Mandal)లోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.106 కోట్ల వ్యయంతో నిర్మించిన జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు.
Jakora Chandur Lift Irrigation | మంత్రికి స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు
మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, ఎంపీ సురేష్ శెట్కార్ హెలికాప్టర్ ద్వారా సిద్దాపూర్ రిజర్వాయర్ (Siddhapur Reservoir) వద్దకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), ఎస్పీ రాజేష్ చంద్ర తదితరులు స్వాగతం పలికారు. మంత్రి రాక సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై మంత్రికి స్వాగతం పలికారు. మహిళలు పూలు జల్లుతూ ఆహ్వానించగా, కార్యకర్తల నినాదాలతో ప్రాంతం మార్మోగింది.
Jakora Chandur Lift Irrigation | సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పరిశీలన..

మంత్రి సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించి, ప్రాజెక్టు పురోగతి, నిర్మాణ నాణ్యత, ఎదురవుతున్న సమస్యలు, పనుల గడువు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రూ.106 కోట్లతో నిర్మించిన జాకోర–చందూర్ ఎత్తిపోతల పథకాలను మెయిన్ స్విచ్ ఆన్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రాజెక్టు వివరాలను మంత్రికి వివరించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు వ్యవసాయాభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Gas Leak | వంటగ్యాస్ లీక్ ఘటనలో ముగ్గురికి గాయాలు..
