అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram Project | కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) అన్నారు. తన నివాసంలో గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు.
Kaleshwaram Project | తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని..
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ (KCR) డిజైన్ చేశారని గంపగోవర్ధన్ తెలిపారు. రూ.98 వేల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో ప్రజలకు స్పష్టంగా అర్థమైందని, ఇక రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల దృష్టి మళ్లించడానికి కాళేశ్వరం ప్రాజెక్టును భూతద్దంలో చూపించి కేసీఆర్పై దుష్ప్రచారం చేశారని విమర్శించారు. హామీలను అమలు చేయకుండా ఢిల్లీ టూర్లు తిరుగుతూ కేంద్రమంత్రుల కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులతో బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి భవిష్యత్తులో బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదని పేర్కొన్నారు.
Kaleshwaram Project | రైతుల అవసరాల కోసం..
రైతుల అవసరాల కోసం కట్టిన మేడిగడ్డ (Medigadda) రెండు పిల్లర్లు ఎలా కూలాయో భవిష్యత్తులో బయటపడతాయని తెలిపారు. కాళేశ్వరంపై ప్రభుత్వం ఏర్పాటు చేసింది జస్టిస్ ఘోష్ కమిటీ (Justice Ghosh Committee) కాదని, పీసీసీ కమిటీ అని ఎద్దేవా చేశారు. ఆ కమిటీ కేవలం కేసీఆర్, హరీష్ రావును అధికారులను బద్నాం చేయడం కోసమే పని చేసిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఫలితంగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందన్నారు. ఆర్టీసీ సమ్మెకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, కార్మికులకు అండగా తాము కూడా సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇకనైనా కేసీఆర్పై బురద చల్లడం మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ACB raids | రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

