అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Leopard Killing Arrest | చిరుతను హతమార్చిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య(CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీపీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
Leopard Killing Arrest | భీమ్గల్ మండలంలో..
సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఆర్మూర్(Armoor) డివిజన్ పరిధిలోని భీమ్గల్ మండలం, కారేపల్లి రేంజ్లో ఒక చిరుతపులిని కొందరు వ్యక్తులు హతమార్చినట్లు అటవీశాఖాధికారులకు (Forest Department) సమాచారం అందింది. దీంతో కమ్మర్పల్లి రేంజ్ అధికారి అనిత, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనంతరం తమ విచారణలో భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మలావత్ సంజీవ్, దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములులను అదుపులోకి తీసుకుని విచారించగా..వారు ఒక చిరుత పులిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలోని 79 కంపార్ట్మెంట్లో హతమార్చిన చిరుత పులి కళేబరాన్ని దాచినట్లు వారు తెలిపారు. దీంతో అటవీశాఖాధికారులు ఆ ప్రాంతం నుంచి చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Leopard Killing Arrest | అత్యాశకు పోయి.. కటకటాల వెనక్కి..
భీమ్గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలావత్ సంజీవ్ మేకల కాపరి. ఒక నెల రోజుల క్రితం మేకల మందను కారేపల్లి అటవీ ప్రాంతంలో మేపడానికి వెళ్లగా ఒక ఆడమేకను చిరుత పులి హతమార్చింది. ఈ విషయాన్ని తన గ్రామంలోని ఇతర వ్యక్తులకు తెలియజేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు సంజీవ్ను కలిశాడు. చిరుత పులి తిరిగి ఆ కళేబరం దగ్గరికి వస్తుందని, దాన్ని చంపి దాని శరీర భాగాలను అమ్ముకుంటే రూ.లక్షల్లో డబ్బు వస్తుందని మాలావత్ సంజీవ్కు ఆశ చూపినాడు. ఆ రాత్రి మలావత్ సంజీవ్ తన గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులతో కలిసి ఆ కళేబరంలోకి గడ్డి మందును సిరంజ్ ద్వారా ఎక్కించారు.
Leopard Killing Arrest | సరైన కొనుగోలుదారుడి కోసం..
మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతానికి నిందితులు వెళ్లి చూడగా చిరుత పులి చనిపోయి ఉంది. ఈ విషయాన్ని మలావత్ సంజీవ్ సిరిసిల్ల రాములు, ఇతర నలుగురు వ్యక్తులకు తెలిపాడు. వారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ చిరుత కళేబరాన్ని దాచిపెట్టి సరైన కొనుగోలుదారుడు దొరికిన తర్వాత దానిని తీసి అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు. చిరుత కళేబరాన్ని గుర్తించిన తర్వాత అటవీశాఖ అధికారులు విచారించగా ఈ వివరాలను సంజీవ్ తెలిపారు. విచారణలో భాగంగా సిరిసిల్ల రాములు ఇంట్లో తనిఖీ చేయగా ఒక నాటు తుపాకీ దొరికింది. దానిని అటవీశాఖ అధికారులు తదుపరి విచారణ కొరకై భీమ్గల్ పోలీసులకు అప్పగించారు. వీరికి సహకరించిన మిగితా నలుగురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 2022, తెలంగాణ అటవీ చట్టం, జీవవైవిద్య చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగిందని..నిందితులను ఆర్మూర్ న్యాయస్థానంలో హాజరు పర్చామని వివరించారు.
ఇది కూడా చదవండి: నాచారం చెరువు అభివృద్ధికి శ్రీకారం..