అక్షరటుడే, కామారెడ్డి: ATM Card Fraud | ఏటీఎం కార్డులు మార్చి అమాయకుల ఖాతాల్లోంచి డబ్బులు కాజేస్తున్న అంతర్రాష్ట్ర నేరస్తుడిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ (Kamareddy DSP Madhusudhan) సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
ATM Card Fraud | కడప జిల్లా పొద్దుటూరు..
డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సీపాల ఈశ్వరయ్య అలియాస్ ఈశ్వర్ ఆదివారం మాచారెడ్డి (Machareddy) చౌరస్తా ఎస్బీఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ర్యాపిడో బైక్ డ్రైవర్గా పనిచేస్తున్న ఈశ్వర్ విలాసవంతమైన జీవితం, మద్యం అలవాట్లకు డబ్బు కోసం ఈ దారి ఎంచుకున్నాడు. గత నెల 27న బాధితుడు యెర్రోళ్ల నర్సింలు ఏటీఎం వాడడం తెలియక ఇబ్బంది పడుతుండగా సాయం చేస్తాననే సాకుతో కార్డు మార్చి, ఎల్లారెడ్డిపేట, కూకట్పల్లి ఏటీఎంలలో రూ.49 వేలు డ్రా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈశ్వర్పై తెలంగాణ, ఏపీలో పలు కేసులున్నాయని డీఎస్పీ తెలిపారు.
ATM Card Fraud | కామారెడ్డి యూనియన్ బ్యాంక్ వద్ద..
కామారెడ్డి యూనియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద రూ.90,600, వేంపల్లి ఎస్బీఐ ఏటీఎం వద్ద రూ.30వేలు, బాల్కొండలో వృద్ధ మహిళ నుంచి రూ.10 వేలు కాజేసినట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. గతంలో తూప్రాన్లో 3, రామాయంపేట, జనగాం, షాబాద్, సంగారెడ్డి, రాజివ్ గాంధీ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు తెలిపారు. ఏటీఎం వినియోగంపై అవగాహన లేని వృద్ధులు, అమాయకులే ఇతడి టార్గెట్ అని చెప్పారు. నిందితుడి నుంచి రూ.46 వేలు నగదు, మొబైల్ ఫోన్, ఎస్బీఐ ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Elderly Parents Harassment | కన్నకొడుకే హింసిస్తున్నాడు.. కాపాడాలని తల్లిదండ్రుల వినతి