అక్షరటుడే, బాన్సువాడ: Marital Distress | భార్య కాపురానికి రావడం లేదనే మనస్థాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) జిల్లా మోస్రా (Mosra) మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
Marital Distress | మోస్రా మండల కేంద్రానికి చెందిన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోస్రా మండల కేంద్రానికి చెందిన గంగా ప్రసాద్ (24)కు నవీపేట (navipet) మండలం అభంగపట్నం గ్రామానికి చెందిన మమతతో వివాహం జరిగింది. అయితే కుటుంబ కారణాల నేపథ్యంలో మమత ఐదు నెలలుగా భర్త వద్దకు రాకుండా తన పుట్టింట్లోనే ఉంటున్నట్లు సమాచారం. భార్య తిరిగి కాపురానికి వస్తుందనే ఆశతో గంగాప్రసాద్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు.
కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.