అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Emergency Day Observance | భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో జూన్ 25 చీకటి రోజు అని.. అధికారం కోసం ఇందిరాగాంధీ (Indira Gandhi)అప్పట్లో నియంతగా మారారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఎమర్జెన్సీ డే నిర్వహించారు.
Emergency Day Observance | 1971 ఎన్నికల్లో..
ఎమ్మెల్యే (MLA Dhanpal) మాట్లాడుతూ.. 1971 ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఉత్తర ప్రదేశ్లోని రాయ్ బరేలీలో పోటీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపారు. దీంతో అలహాబాద్ హైకోర్టు నాలుగేళ్లు విచారించిన తర్వాత అధికార దుర్వినియోగం జరిగిందని తీర్పునిచ్చిందని చెప్పారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలాగే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదని నిషేధం విధించిందన్నారు. కానీ ఇందిరా గాంధీ రాష్ట్రపతిని కలిసి అంతర్గత భద్రత కారణాన్ని చూపి ఎమర్జెన్సీ ప్రకటించారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలైన అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ, మొరార్జీ దేశాయ్ లాంటి వారిని వారెంట్ లేకుండా అరెస్టు చేశారని గుర్తు చేశారు.
Emergency Day Observance | పత్రిక కార్యాలయాలకు విద్యుత్ కోతలు.
ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన పత్రిక కార్యాలయాలకు విద్యుత్ కోత విధించడం, జర్నలిస్టులను జైల్లో పెట్టించడం జరిగిందన్నారు. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి, ప్రజల స్వేచ్ఛను పూర్తిగా హరించారని విమర్శించారు. అలాగే ఇందూరు నుంచి అనేకమంది ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. అలాగే జూన్ 25న సంవిధాన్ హత్య దివస్గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ కాలంలో జైలుకు వెళ్లిన వారి త్యాగాలను వృథా కానివ్వమన్నారు.
Emergency Day Observance | ఇందూరు వాసులకు సన్మానం..
ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన సంఘ్ నేతలు రాజేశ్వర్, సిలివేరు శ్రీధర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆనాటి అనుభవాలను వారిరువురు పంచుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసన్న సత్యపాల్, సుమిత్ర కిషోర్, ప్రసూన శ్రీనివాస్, ఓబీసీ మోర్చా నాయకుడు స్వామి యాదవ్, ఆయా మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: SC ST Journalists Issues | ఎస్సీ,ఎస్టీ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..