అక్షరటుడే, కామారెడ్డి: Urea Supply Review | యూరియా కొరత అంటూ ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
Urea Supply Review | జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు
జిల్లాలో యూరియా కొరతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూరియా నిల్వలు, పంపిణీ విధానం, రైతుల అవసరాలు, ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన యూరియా వివరాలను అధికారులు షబ్బీర్ అలీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. గతేడాది జూలై వరకు కామారెడ్డి నియోజకవర్గానికి మొత్తం 106 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు గుర్తు చేసిన షబ్బీర్ అలీ.. ఈ ఏడాది జూన్ 20వ తేదీ నాటికే 140 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు వెల్లడించారు. ఇది గతేడాదితో పోలిస్తే గణనీయమైన పెరుగుదల అని పేర్కొన్నారు.
Urea Supply Review | రాబోయే రోజుల్లో జిల్లాకు మరింత యూరియా
అదనంగా రాబోయే రోజుల్లో మరింత యూరియా నిల్వలను జిల్లాకు తరలిస్తున్నామని, శుక్రవారం సాయంత్రం వరకు కూడా కొత్త స్టాక్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా నిరంతర సరఫరా కొనసాగుతుందని చెప్పారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం యూరియా కొరత ఉందంటూ రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు అలాంటి ప్రచారాలను నమ్మకుండా అధికారులతో, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

రైతులకు తగినంత యూరియా అందించడం ప్రభుత్వ బాధ్యత అని, రైతుల అవసరాలపై ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతి రైతుకు అవసరమైన ఎరువులు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని పేర్కొన్న ఆయన, రైతుల సంక్షేమం కోసం సీఎం నాయకత్వంలోని ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా తమ వ్యవసాయ పనులను కొనసాగించాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Drug Awareness | మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి..: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్