Tirumala Devotee Rush | తిరుమల యాత్రలో అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం ప్రకటన

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Tirumala Devotee Rush | వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. శుక్రవారం నుంచి మొదలైన భక్తుల తాకిడి ఆదివారం నాటికి భారీగా పెరగడంతో, స్వామివారి దర్శనానికి భక్తులు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. మరోవైపు, ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ  శ్రీవారిని దర్శించుకుని భారీ విరాళాలను ప్రకటించడం విశేషంగా మారింది.

Tirumala Devotee Rush | సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల సమయం..

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో దర్శన సమయాలు గణనీయంగా పెరిగాయి. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోగా, క్యూలైన్లు నారాయణగిరి షెడ్ల మీదుగా బాటగంగమ్మ గుడి వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు తాజా దర్శన సమయాలను వెల్లడించారు. దీని ప్రకారం సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు 24 నుంచి 30 గంటల సమయం పడుతుండగా, దర్శన టోకెన్లు (సర్వదర్శనం/దివ్యదర్శనం) ఉన్నవారికి 5 నుంచి 7 గంటల సమయం, అలాగే రూ. 300 ప్రత్యేక శీఘ్ర దర్శనం చేసుకునే వారికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ananth.1

Tirumala Devotee Rush | భక్తుల రద్దీ – గణాంకాలు..

శనివారం ఒక్కరోజే శ్రీవారిని 85,582 మంది భక్తులు దర్శించుకోగా, అందుకు అనుగుణంగా తిరుమలలో భక్తులకు అన్ని రకాల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ఈ భక్తుల రద్దీ నేపథ్యంలో, శనివారం నాటి గణాంకాలను పరిశీలిస్తే, సుమారు 44,155 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా, భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.76 కోట్ల ఆదాయం లభించగా, 4.66 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. ఇక అన్నప్రసాదాల విభాగంలో 3.43 లక్షల మంది భక్తులు శ్రీవారి ప్రసాదాలను స్వీకరించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Tirumala Devotee Rush | అనంత్ అంబానీ భారీ విరాళం..

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ టీటీడీకి వినూత్నమైన విరాళాలను ప్రకటించారు. ఇందులో భాగంగా, సుమారు రూ. 27.5 కోట్ల విలువైన 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఈ బస్సులను నడిపే 50 మంది డ్రైవర్ల జీతభత్యాలను కూడా తమ సంస్థే భరిస్తుందని హామీ ఇచ్చారు. వీటితో పాటు, తిరుమలలోని గోశాలను గుజరాత్‌లోని తమ ‘వంతారా’ ప్రాజెక్ట్ తరహాలో ఆధునీకరించేందుకు, తిరుమల క్షేత్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అనంత్ అంబానీ తన అంగీకారాన్ని తెలియజేశారు.

ఇది కూడా చదవండి:  Amaravati YSRCP Tour | రాజధానిలో ‘రౌడీల’ రచ్చ.. వైకాపా నేతలపై కేసులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *