అక్షరటుడే, పెద్దకొడప్గల్: Hostel Food Issues | విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన వసతిగృహాలు వారిని అనేక ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. సరైన సమయంలో భోజనం అందక.. అనారోగ్య సమయంలో చికిత్స చేయించేవారు లేక అభంశుభం తెలియని విద్యార్థులు అల్లాడిపోతున్నారు.
Hostel Food Issues | పెద్దకొడప్గల్ బాలుర గిరిజన వసతి గృహంలో..

పెద్దకొడప్గల్ మండలం (Peddakodapgal Mandal) చావుని తండాలోని బాలుర గిరిజన వసతి గృహంలో సమస్యలు తిష్ట వేశాయి. సరైన సమయంలో భోజన వసతి అందక చిన్నారులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహంలో స్నానం గదులు, మరుగు దొడ్డి తలుపులకు మరమ్మతులు చేయకపోవడంతో విద్యార్థులు ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. అలాగే గతంలో వసతి గృహంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలు పని చేయకపోవడంతో విద్యార్థులు పడుతున్న అవస్థలు ఉన్నతాధికారులకు సైతం చేరట్లేదు. మండలంలోని మారుమూల తండాలో ఈ వసతి గృహం ఉండడంతో అధికారులు ఇక్కడి దాకా ఏం వచ్చి చూస్తారులే అనే నిర్లక్ష్యం సైతం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
Hostel Food Issues | విద్యార్థులకు అందని బ్రేక్ పాస్ట్..?

వసతి గృహం ఈనెల 15వ తేదీన పున:ప్రారంభమైంది. అయితే గత వారంరోజుల నుంచి విద్యార్థులు హాస్టల్కు వస్తున్నారు. అప్పటి నుండి వారంలో ఐదు రోజులు గుడ్లు, అరటి పండ్లు విద్యార్థులకు అందించాలి. అలాగే బుధ, ఆదివారాల్లో చికెన్ కర్రీతో భోజనం పెట్టాల్సి ఉంది. కానీ వారంలో రెండు రోజులు గుడ్లు, అరటి పండ్లు, ఒక బుధవారం చికెన్ మాత్రమే ఇస్తున్నట్లు తెలిసింది. ఉదయం 6.30 గంటలకు రాగి జావా, ఒక గ్లాస్ పాలు విద్యార్థులకు అందించాల్సి ఉండగా.. హాస్టల్ ప్రారంభమైనప్పటి నుంచి జావా, పాలు ఇవ్వలేదని తెలుస్తోంది. విద్యార్థులు పాఠశాల నుండి తిరిగి వసతి గృహానికి చేరిన తర్వాత సాయంత్రం 5గంటల సమయంలో స్నాక్స్ అందించాలి. కానీ వారం రోజులైనా విద్యార్థులను సాయంత్రం స్నాక్స్ ఇవ్వట్లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మెనూ పాటించకపోతే వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఇన్ఛార్జి వార్డెన్ రమేష్ను ‘అక్షరటుడే’ సంప్రదించగా.. వసతిగృహంలో సమస్యలు ఉన్నమాట వాస్తవమేనని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యార్థుల మెనూపై ప్రశ్నించగా.. తప్పనిసరిగా మెనూను అమలు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Rakesh Reddy Comments | ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు