అక్షరటుడే, వెబ్డెస్క్: UAPA Terrorists | UAPA చట్టం కింద 23 మందిని కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్లో జైష్-ఎ-మహ్మద్ (JeM) మరియు లష్కర్-ఎ-తైబా (LeT)లతో సంబంధం ఉన్న పాకిస్థాన్ (Pakistan)కు చెందిన పలువురు ఉగ్రవాదుల పేర్లు ఉన్నాయి. ఈ వ్యక్తులు ఉగ్రవాద నియామకాలు, చొరబాటు, శిక్షణ, డ్రోన్ల ద్వారా ఆయుధాల సరఫరా, జమ్మూ కాశ్మీర్లో దాడుల ప్రణాళికలలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
UAPA Terrorists | ముగ్గురు హఫీజ్ సయీద్ సన్నిహితులు
కేంద్ర ఉగ్రవాదులుగా ప్రకటించిన 23 మందిలో ముగ్గురు LeT వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్కు సన్నిహితులని తెలుస్తోంది. ముగ్గురు 2016లో నగోటాలోని ఆర్మీ క్యాంప్పై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నారని భావిస్తున్నారు. ఇద్దరు 2018లో సుంజ్వాన్ మిలిటరీ స్టేషన్పై జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్నారని ఆరోపణలు ఉన్నాయి.
హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో సయీద్ సన్నిహితులుగా అబ్దుల్ రౌఫ్, హాఫిజ్ ఖాలిద్ వలీద్, రాణా ఇఫ్తికార్లను గుర్తించింది. “రాణా ఇఫ్తికార్, జిహాదీ వ్యతిరేక సంస్థల మధ్య సమన్వయం చేస్తూ, ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు యువతను ప్రేరేపిస్తాడు. లష్కర్-ఎ-తైబా (LeT), జమాత్-ఉద్-దావాకు చెందిన 52 ఏళ్ల అబ్దుల్ రౌఫ్, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రణాళిక చేయడం, సమన్వయం చేయడం, నిధులు సేకరించడంలో పాలుపంచుకుంటాడు. హాఫిజ్ మహమ్మద్ సయీద్ ప్రత్యక్ష ఆదేశాల కింద LeTలోని ప్రధాన ఉగ్రవాదులలో ఒకడు” అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.
UAPA Terrorists | ఉగ్రవాదులుగా ప్రకటిస్తే ఏం జరుగుతుంది?
చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 (37 ఆఫ్ 1967) ప్రకారం.. ఒక వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలలో పాలుపంచుకున్నాడని కేంద్ర ప్రభుత్వం భావిస్తే, ఆ వ్యక్తి పేరును ఉగ్రవాదిగా ప్రకటించే అధికారం ఉంది. ఈజాబితాలో ఉగ్రవాదుల పేర్లను చేర్చడం వల్ల జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వారి ఆర్థిక లావాదేవీలను నిలువరించడానికి, ఆయుధాల అమ్మకాలపై ఆంక్షలు విధించడానికి, మరియు వారి ఆస్తులను జప్తు చేయడానికి వీలు కలుగుతుంది.
ఇది కూడా చదవండి..: Russia Fuel Shortage | రష్యాలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద క్యూలు