అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police | పోలీసు – ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలే నేరాల నివారణకు కీలకమని, ప్రజలే తమకు ప్రధాన బలమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Kamareddy Police | 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒక తల్వార్ స్వాధీనం
ఈ సందర్భంగా ఎస్పీ (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. నేరాల ఛేదనకు ప్రజలు ఇచ్చే సమాచారమే అతి పెద్ద ఆయుధమన్నారు. ఇటీవల ఛేదించిన పలు దొంగతన కేసుల్లో పంచర్ షాపు కార్మికుడు, విలేకరి ఇచ్చిన సమాచారం కీలకంగా మారిందని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనాలు, గంజాయి లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల సమాచారం ఉంటే వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా చేసిన తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లు పరిశీలించారు. వీటిలో 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్నట్లు గుర్తించారు. 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నారు.
Kamareddy Police | ఉద్యోగాల పేరుతో మోసాలు

అసాంఘిక కార్యకలాపాలపై ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసి యువతను రెచ్చగొట్టినా, ప్రజల్లో భయాందోళన కలిగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, కొనుగోలు చట్టరీత్యా నేరమని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని సూచించారు. సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడుల మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మోసానికి గురైతే 1930కు ఫోన్ చేయాలని తెలిపారు. హెల్మెట్ తప్పనిసరి అని, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉండాలని, ప్రతి ఇంటి వద్ద సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి, రూరల్ సీఐ శ్రీధర్, భిక్కనూరు సీఐ నరేష్, ఆర్ఐలు సంతోష్, నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Heavy Rain | దంచి కొట్టిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం!