అక్షరటుడే, వెబ్డెస్క్: Fatima College | హైదరాబాద్ నగరంలోని సల్కం చెరువులో ఉన్న ఫాతిమా కాలేజీపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో లేదంటున్న సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) కంటి పరీక్ష చేయించుకోవాలన్నారు.
కవిత ఎక్స్ వేదికంగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పేదలను బుల్డోజర్ల కింద నలిపేస్తున్న రేవంత్ సర్కార్ ఒవైసీ విద్యాసంస్థలను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. చెరువును కబ్జా చేసి కట్టిన కాలేజీ ప్రపంచమంతా చూస్తున్నా సీఎంకు మాత్రమే కనిపించడం లేదంటే తక్షణమే ఆయన కంటి పరీక్ష చేయించుకోవాలని ఎద్దేవా చేశారు.
Fatima College | ఏం జరిగిందంటే..
ఎంఐఎం పార్టీ నేతలు ఒవైసీ కుటుంబనికి చెందిన ఫాతిమా కాలేజీపై కొంతకాలంగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ కాలేజిని సల్కం చెరువులో కట్టారు. ఈ మేరకు ఫొటోల్లో, మ్యాపుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం తాజాగా ఆ కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని కోర్టుకు తెలిపింది. ఈ వ్యాఖ్యలపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కవిత ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలుస్తున్న హైడ్రా.. ఫాతిమా కాలేజీ జోలికి ఎందుకు వెళ్లడం లేదన్నారు.
Fatima College | మాట మార్చిన ప్రభుత్వం

హైదరాబాద్ నగరంలో చెరువుల్లో ఆక్రమణలను తొలగించడానికి ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. పేదల నివాసాలను బుల్డోజర్లతో కూల్చివేసింది. అయితే పెద్దల జోలికి వెళ్లేందుకు హైడ్రా భయడుతుందని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సల్కం చెరువులో ఫాతిమా కాలేజీని టచ్ చేయడం లేదని ఇన్ని రోజులు ఆరోపణలు వచ్చాయి. గతంలో హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. ఆ కాలేజీని కూలిస్తే విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. అంటే అది ఎఫ్టీఎల్ ఉందని ఆయన పరోక్షంగా అంగీకరించారు. అయితే తాజాగా ప్రభుత్వం మాట మార్చి.. ఆ కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని చెప్పడం గమనార్హం.
ఇది కూడా చదవండి..: Hyderabad Couple Missing | స్విట్జర్లాండ్లో హైదరాబాద్ జంట అదృశ్యం!