అక్షరటుడే, కామారెడ్డి: Pillar Pit Accident | కామారెడ్డి Kamareddy జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇంటి ఎదుట నిర్మాణ పనుల కోసం తవ్విన పిల్లర్ గుంతలో ప్రమాదవశాత్తు రెండేళ్ల చిన్నారి పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో గురువారం జరిగింది.
Pillar Pit Accident | తల్లి వెనకాలే వెళ్తూ..
స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడమంచి అరవింద్ కుమార్తె నవ్యశ్రీ (2) తన తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లడాన్ని గమనించి వెనకాలే వెళ్లింది. కాగా, ఇంటి సమీపంలో కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంత వద్దకు చేరుకున్న చిన్నారి ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడిపోయింది. గుంత పూర్తిగా వరద నీటితో నిండిపోవడంతో చిన్నారి అందులో మునిగిపోయింది.
కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అనంతరం పిల్లర్ గుంతలో చిన్నారి పడిఉన్నట్లు గుర్తించి వెంటనే బయటకు తీసి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Pillar Pit Accident | సీసీ టీవీలో రికార్డు..
చిన్నారి మృతిపై తొలుత అనుమానాలు వ్యక్తం కావడంతో ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలించారు. అందులో చిన్నారి ఇంటి నుంచి బయటకు వచ్చి నేరుగా పిల్లర్ గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయిన దృశ్యాలు స్పష్టంగా నమోదైనట్లు తెలిసింది.
అనుకోని ప్రమాదంలో చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Pillar Pit Accident | రక్షణ చర్యలు ఏవి..?
చిన్నారిని బలి తీసుకున్న గుంత పూర్తిగా వరద నీటితో నిండిపోయి ఉంది. దీని చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ దారుల నిర్లక్ష్యానికి అభం శుభం తెలియని చిన్నారి నిండు జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని వాపోతున్నారు.
ఈ ఘటన నిర్మాణ ప్రాంతాల వద్ద తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ముఖ్యంగా బహిరంగంగా తవ్విన గుంతల చుట్టూ రక్షణ ఏర్పాట్లు లేకపోతే ఇలాంటి విషాదాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.