అక్షరటుడే వెబ్డెస్క్: Nasha Mukt Yuva | మాదకద్రవ్య రహిత భారతదేశ ( నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘మై భారత్’ (MY Bharat) తెలంగాణ శాఖ ( Telangana )ఆధ్వర్యంలో ఆగస్టు 2న రాష్ట్రవ్యాప్తంగా ‘నషా ముక్త యువ ఫర్ వికసిత్ భారత్–సంకల్ప్ అభియాన్’ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతీయ స్థాయిలో చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో యువతను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా 10 వేలకుపైగా కేంద్రాల్లో పాల్గొనే కోటి మందికిపైగా యువతతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ‘నషా ముక్త యువ ప్రతిజ్ఞ’ చేయించనున్నారు.
Nasha Mukt Yuva | రాష్ట్రస్థాయి వేడుకలు..
తెలంగాణలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, సిద్ధిపేటలోని కావేరి విశ్వవిద్యాలయం, వరంగల్లోని వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మరో ఐదు జిల్లాల్లో జిల్లా స్థాయి కార్యక్రమాలు చేపట్టి, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సంకల్ప ప్రతిజ్ఞ చేయనున్నారు.
Nasha Mukt Yuva | అవగాహన కార్యక్రమాలు..
ఈ కార్యక్రమంలో భాగంగా సామూహిక ప్రతిజ్ఞతో పాటు అవగాహన ర్యాలీలు, యువజన సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై యువతలో అవగాహన కల్పించడం, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో వారిని భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. జిల్లా యంత్రాంగం, విశ్వవిద్యాలయాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో యువశక్తి భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మై భారత్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ చి. అన్వేష్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Digital Classes | విద్యార్థులకు ఆధునిక విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి