అక్షరటుడే, వెబ్డెస్క్: Lingampally Drug Smuggler | హైదరాబాద్ Hyderabad మహా నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
ఈ క్రమంలో లింగంపల్లి రైల్వే స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
Lingampally Drug Smuggler | విశాఖపట్నం నుంచి రవాణా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రంలోని పాట్నాకు చెందిన సన్నీ కుమార్ (28) ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చాడు. కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రాకపోవడంతో అతడు అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు.
తొలుత డ్రగ్స్ రవాణాదారుగా పనిచేసిన సన్నీ కుమార్, అనంతరం స్వయంగా గంజాయి కొనుగోలు చేసి విక్రయించే స్మగ్లింగ్ కార్యకలాపాల్లోకి దిగినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి సుమారు 14.77 కిలోల గంజాయి కొనుగోలు చేసి, రైలులో హైదరాబాద్కు తీసుకొచ్చాడు. లింగంపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగిన వెంటనే నిఘా ఉంచిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Lingampally Drug Smuggler | 14.77 కిలోల నిల్వలు..
నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.7.50 లక్షల విలువైన 14.77 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.