అక్షరటుడే, వెబ్డెస్క్ : Komatireddy Rajagopal Reddy | కాంగ్రెస్లో మరోసారి అసమ్మతి రేగింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం యాదగురిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు (Yadagirigutta Temple Board)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. యాదాద్రి జిల్లాలోనే తన నియోజకవర్గంలో ఉన్నా.. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా బోర్డును ఏర్పాటు చేశారని రాజగోపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సమాచారం ఇచ్చి ఉంటే నియోజకవర్గానికి చెందిన ఒకరినైనా బోర్డులో చేర్చించేవాడినని తెలిపారు. సీఎం ఏకపక్ష పోకడలు తనకు నచ్చడం లేదన్నారు. ఆయన వ్యవహారశైలి నచ్చకనే నల్గొండ సభకు వెళ్లలేదని స్పష్టం చేశారు.
Komatireddy Rajagopal Reddy | వాళ్లదే నడుస్తుంది

రేవంత్ రెడ్డి వ్యవహారశైలి బాగోలేదని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. సీఎం తీరు నచ్చకపోయినా.. ఆయనతో టచ్లో ఉంటున్నానని తెలిపారు. ఇటీవల రాహుల్గాంధీని సైతం కలిశానన్నారు. కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తమకు కూడా యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డులో అవకాశం కల్పించి ఉంటే బాగుండేదని అన్నారు. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెసోళ్లు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన కొత్తవాళ్లది నడుస్తుందన్నారు.
Komatireddy Rajagopal Reddy | సొంత పార్టీపైనే..
రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తున్నారు. ఆయన మంత్రి పదవి ఆశించారు. అయితే అధిష్టానం అవకాశం ఇవ్వలేదు. దీంతో గతంలో సీఎం రేవంత్రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అయితే కొంతకాలంగా రాజగోపాల్రెడ్డి మౌనంగా ఉంటున్నారు. ఈ క్రమంలో యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డు ఏర్పాటుతో మరోసారి సీఎంపై విమర్శలు చేశారు. ఇటీవల నల్గొండలో జరిగిన సభకు సైతం రాజగోపాల్రెడ్డి హాజరు కాలేదు. దీంతో మరోసారి పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి : Yadagirigutta Temple Board | యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు.. చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు చోటు