అక్షరటుడే వెబ్డెస్క్:Traffic Restrictions Telangana| రాష్ట్రవ్యాప్తంగా తన కాన్వాయ్ లేదా ఇతర వీఐపీల పర్యటనల వల్ల ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు. బుధవారం (మే 6, 2026) విమానాశ్రయం వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ రద్దీని స్వయంగా గమనించిన ముఖ్యమంత్రి, ఈ పరిస్థితిపై తీవ్రంగా స్పందించారు. కాన్వాయ్ ప్రయాణించే సమయంలో రోడ్లపై ప్రజలు ఎక్కువసేపు వేచి ఉండకుండా చూడాలని, ఎదురుగా వచ్చే వాహనాలను అనవసరంగా ఆపకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎక్కడైనా లోపాలు జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సివి ఆనంద్ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో డీజీపీ సివి ఆనంద్ రాష్ట్రంలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.
Traffic Restrictions Telangana| త్వరలో ట్రాఫిక్ బ్యూరో ప్రారంభం..
కాన్వాయ్ వెళ్లేటప్పుడు వాహనాలను పూర్తిగా నిలిపివేయకుండా, ట్రాఫిక్ను క్రమపద్ధతిలో మళ్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి అదనపు డీజీపీ నేతృత్వంలో ఒక ప్రత్యేక ట్రాఫిక్ బ్యూరోను త్వరలో ప్రారంభించనున్నారు. ముఖ్యంగా రద్దీ సమయాల్లో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలి. రాబోయే వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా చురుకైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై అక్రమ పార్కింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని డీజీపీ స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్లతో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొని, సమర్థవంతమైన ట్రాఫిక్ నియంత్రణ కోసం సమన్వయంతో పనిచేస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Education Fee Regulation| విద్య వ్యాపారం కావొద్దు.. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందే: కవిత

