అక్షరటుడే, బాన్సువాడ: Gram Panchayat Workers | గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ప్రతినెలా అందించే గౌరవ వేతనం సకాలంలో అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారికి బ్యాంక్ ఖాతాల్లో వేతనం జమ చేస్తున్నప్పటికీ గతంలో మాన్యువల్గా ఇవ్వాల్సిన గౌరవ వేతనం అందకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
Gram Panchayat Workers | బాన్సువాడ మండలం మొగులాన్పల్లిలో..
బాన్సువాడ మండలం (Banswada Mandal) మొగులాన్ పల్లి తండా గ్రామపంచాయతీలో ముగ్గురు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామ పరిశుభ్రత, డ్రైనేజీల శుభ్రపర్చే పనులు, చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ వంటి కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ, తమకు రావాల్సిన గౌరవ వేతనం అందక కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు. ఆన్లైన్ చెల్లింపుల విధానం ప్రారంభానికి ముందు మాన్యువల్గా చెల్లించాల్సిన రెండు నుంచి మూడు నెలల గౌరవ వేతనాన్ని సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఇప్పటివరకు విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు కార్యదర్శిని సంప్రదించినా సరైన స్పందన లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని వారు తెలిపారు.
Gram Panchayat Workers | నెలవారీ వేతనంపైనే..
నెలవారీ వేతనంపైనే కుటుంబ జీవనం ఆధారపడిన తమలాంటి కార్మికులకు మూడు నెలల గౌరవ వేతనం నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసర ఖర్చులు, వైద్య అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: CMR Scam | మిల్లర్ల మాయాజాలం.. రూ.కోట్ల విలువైన ధాన్యం మాయం