Bhu Bharati Applications | భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Bhu Bharati Applications | భూభారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భవేష్ మిశ్రా (Collector Bhavesh Mishra) ఆదేశించారు. కలెక్టరేట్​లో శుక్రవారం ఆయన అన్ని మండలాల తహశీల్దార్లతో భూ భారతి, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష జరిపారు.

Bhu Bharati Applications | పెండింగ్​ దరఖాస్తులపై ఆరా..

ఒక్కో మండలం వారీగా పెండింగ్​లో ఉన్న దరఖాస్తులు ఎన్ని ఉన్నాయని ఆయన ఆరా తీశారు. వాటి పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన జరుపుతూ ఈ నెలాఖరులోగా అన్నింటిని పరిష్కరించాలని కలెక్టర్ గడువు విధించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని, ప్రాధాన్యత క్రమంలో దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణితో పాటు, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే సీఎం ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

Bhu Bharati Applications | వెంటవెంటనే సమస్యలు పరిష్కరించాలి

వెంటదివెంట అర్జీలను పరిష్కరిస్తూ, వివరాలను ఆన్​లైన్​లో అప్​లోడ్​ చేయాలని సూచించారు. పైఅంశాలకు సంబంధించి నిర్ణీత నమూనాలో రోజువారీగా తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ కోసం వచ్చిన దరఖాస్తులను కూడా సత్వరమే పరిశీలిస్తూ పరిష్కరించాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని ఈనెల 17వ తేదీ లోపు అన్ని ఎఫ్​ఆర్​సీ దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కస్టం మిల్లింగ్ కోసం లేవీ ధాన్యం కేటాయించిన రైస్ మిల్లులను ప్రతి పక్షం రోజులకు ఒకసారి అయిన తప్పనిసరిగా సందర్శిస్తూ, ధాన్యం నిల్వలను పరిశీలించాలని తహశీల్దార్లను ఆదేశించారు. నూతన తహశీల్దార్ కార్యాలయాల నిర్మాణాల కోసం ఆయా మండలాల్లో అవసరమైన స్థలాలను గుర్తిస్తూ, సమగ్ర వివరాలతో నివేదికలు పంపాలని సూచించారు.

Bhu Bharati Applications | ఆలస్యంగా హాజరైన తహశీల్దార్లకు నోటీసులు

Bhu Bharati Applications

ఇదిలాఉండగా, సమీక్షా సమావేశానికి ఆలస్యంగా హాజరైన తహశీల్దార్లకు కలెక్టర్ భవేష్ మిశ్రా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిర్ణీత సమయానికి కలెక్టర్ సమావేశ మందిరానికి చేరుకోగా, పలు మండలాల తహశీల్దార్లు గైర్హాజరు కావడాన్ని గమనించి వారి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత సమయం అనంతరం మరో 15 నిమిషాల వరకు కూడా సమావేశం హాల్​కు చేరుకోలేకపోయిన తహశీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్రతిఒక్కరు విధిగా సమయ పాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జిల్లా రెవెన్యూ అధికారి గీత, నిజామాబాద్, బోధన్ ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయకుమారి, ఆయా మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: OBC National Conference | ఓబీసీ 11వ జాతీయ మహాసభల్లో నిజామాబాద్ బీసీ శ్రేణులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *