అక్షరటుడే వెబ్డెస్క్: Revanth Reddy Mulugu Visit | ఈ నెల 16న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పంచాయతీ రాజ్ హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్డు పనుల కార్యక్రమానికి సీఎం ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ బోర్కేడే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, డీఎఫ్వో వికాస్ మీనాలతో కలిసి ఆమె అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Revanth Reddy Mulugu Visit | పర్యటన అంశాలు
ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి నేరుగా మేడారం చేరుకుని వన దేవతలను దర్శించుకుంటారు. ఆ తర్వాత ములుగుకు చేరుకుని పైలాన్ను ప్రారంభిస్తారు. అలాగే ములుగు మండలం ఇంచర్ల శివారులో రూ.7 కోట్లతో నిర్మించిన ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని వర్చువల్ విధానంలో, నూతన కలెక్టరేట్ సముదాయ భవనాన్ని ప్రత్యక్షంగా ప్రారంభిస్తారని మంత్రి సీతక్క వెల్లడించారు. సీఎం పర్యటన పూర్తి షెడ్యూల్ను ఈ నెల 12న అధికారికంగా వెల్లడించనున్నట్లు చెప్పారు.
Revanth Reddy Mulugu Visit | మంత్రి సీతక్క ఆదేశాలు..
జిల్లాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి పనుల పూర్తి వివరాల జాబితాను ఈ నెల 10వ తేదీలోగా సిద్ధం చేయాలి. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.మేడారం పరిసర ప్రాంతాల్లో రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారికి జరిమానాలు విధించడంతో పాటు, ముందస్తు చర్యలు తీసుకోవాలి.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కల్యాణి, జిల్లా ఆత్మ కమిటీ ఛైర్మన్ రఘు, రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ భగవాన్ రెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్ఓ రవికుమార్, ఎస్డీసీ ప్రతాప్, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ కుషిల్ వంశీ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ASI Promotions Nizamabad | పది మంది హెడ్కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి