అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Education Development | విద్యారంగ అభివృద్ధిలో కామారెడ్డి జిల్లా (Kamareddy District)కు అన్యాయం జరుగుతోందని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కర్ వినయ్ కుమార్ ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Kamareddy Education Development | హామీ ఇచ్చి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలకు మంజూరు చేసి పనులు ప్రారంభించినప్పటికీ, జిల్లా కేంద్రమైన కామారెడ్డి నియోజకవర్గానికి మాత్రం మంజూరు చేయలేదని విమర్శించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందించే ఈ పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తే వేలాది మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పూలే జయంతి సభలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వారం రోజుల్లో కామారెడ్డికి స్కూల్ మంజూరు అవుతుందని హామీ ఇచ్చినప్పటికీ నెలలు గడిచినా ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
Kamareddy Education Development | పేద కుటుంబాలపై ఆర్థిక భారం
ఈ కోర్సుల కోసం విద్యార్థులు ఇతర జిల్లాలు, హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుండటంతో పేద కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపారు. భిక్కనూరు మండలం గుర్జకుంటలో కేటాయించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను కూడా జిల్లా కేంద్రమైన కామారెడ్డిలోనే ఏర్పాటు చేయాలని కోరారు. అప్పుడే జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు రవాణా సౌకర్యంగా ఉంటుందన్నారు. యంగ్ ఇండియా స్కూల్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు, ఏటీసీ విషయంలో కామారెడ్డి విద్యార్థులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోకపోతే విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు పాషా, ప్రధాన కార్యదర్శి చందు, కార్యదర్శి అశ్విని, నోమన్, ప్రణయ్, రిత్విక, వేణు, హిమశ్రీ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Armoor Municipal Corruption | ఆర్మూర్ బల్దియాలో ‘మామూళ్ల’ పర్వం..