అక్షరటుడే, వెబ్డెస్క్: Rare Stone Fraud | నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, మహిమలు ఉన్నాయంటూ ప్రచారం చేసిన ఒక రాయిని అధిక ధరలకు విక్రయించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిటీ కమిషనర్ టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ రఘునాథ్ వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar District) నవాబ్పేటకు చెందిన కేతావత్ రాజు, మైలార్దేవ్పల్లి ప్రాంతానికి చెందిన పి. నరసింహ, వడత్య కుమార్, ప్రవీణ్ సింగ్, మంగళి బసవ నరేష్, వేములవాడకు చెందిన సిద్ధాంతి చల్లా రవి ఒక ముఠాగా ఏర్పడ్డారు. 2024లో పి. నరసింహ అనే వ్యక్తి వేములవాడకు చెందిన చల్లా రవి, కొండపల్లి భిక్షపతి వద్ద నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహాన్ని రూ.10 లక్షలకు కొనుగోలు చేసి మోసపోయాడు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని వడత్య కుమార్కు అందజేశాడు. అనంతరం వారు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆ నకిలీ విగ్రహానికి దివ్యశక్తులు ఉన్నాయని, అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మబలికి భారీ ధరలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
Rare Stone Fraud | అరుదైన రాయి ఉందని..
కేతావత్ రాజు తన వద్ద ఒక అరుదైన గులాబీ రంగు రాయి ఉందని, దాన్ని కూడా అధిక ధరకు విక్రయించవచ్చని ముఠాలో చేరాడు. ఆ రాయికి మహిమలు ఉన్నాయని ప్రచారం చేశారు. శనివారం కాటేదాన్, లక్ష్మిగూడ సమీపంలో ఈ ముఠా విగ్రహం, రాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ పంచలోహ లక్ష్మీదేవి విగ్రహం, గులాబీ రంగు రాయి, ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి..: Hyderabad SPO Recruitment 2026 | హైదరాబాద్లో 150 ఎస్పీవో పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?