అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma Houses Cement | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ సిమెంట్ అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) విజ్ఞప్తి చేశారు.
సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరల తగ్గింపుపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో మంగళవారం మంత్రి సమావేశమయ్యారు. మొదటి దశలో పలు ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, మరికొన్ని వివిద దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. రెండో విడతలో (Second Phase) నియోజకవర్గానికి రెండు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు అవసరమైన సిమెంట్ను తక్కువ ధరకే అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, పరిశ్రమలు, ప్రజలు కలిసి పనిచేస్తే తెలంగాణలో గుడిసెలు లేని రాష్ట్రం లక్ష్యాన్ని త్వరితగతిన సాధించవచ్చని తెలిపారు.
Indiramma Houses Cement | అంగీకరించిన యాజమాన్యాలు
మంత్రి విజ్ఞప్తి మేరకు ఒక్కో బస్తాను రూ.230లకే ఇవ్వడానికి యాజమాన్యాలు అంగీకరించాయి. మంత్రి పొంగులేటి యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ బస్తాల ధరలు రకాన్ని బట్టి రూ.260 నుంచి రూ.350 వరకు ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి 250పైగా బస్తాలు అవసరం అవుతాయి. తాజాగా ధరల తగ్గింపుతో ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక భారం తగ్గనుంది. ఈ సమావేశంలో పరిశ్రమల యాజమాన్యాలతోపాటు హౌసింగ్ సెక్రటరీ వి.పి.గౌతమ్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Adulterated Ghee | నెయ్యి కొంటున్నారా.. ఈ విషయం తెలిస్తే షాక్ అవుతారు!