అక్షరటుడే ఇందూరు: Kaleshwaram Project | గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు నీళ్లల్లో పోశారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి ఆరోపించారు. నగరంలోని రాజీవ్గాంధీ ఆడిటోరియంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రొసీడింగ్స్ అందజేశారు.
Kaleshwaram Project | అర్హులైన ప్రతి ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇల్లు
పదేళ్ల క్రితం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని.. కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా (Nizamabad District)కే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రూ.కోట్ల నిధులు నీళ్లల్లో పోశారని అన్నారు. కానీ ఏనాడు కూడా పేదవారికి ఇళ్లు కట్టిద్దామని ఆలోచన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదన్నారు. పేదలకు మాయమాటలు చెప్పి పదేళ్లు పాలన సాగించిన బీఆర్ఎస్ వారి కార్యకర్తలకే పథకాలు అమలు చేసిందన్నారు. ఏడాదికి రెండు లక్షల చొప్పున పదేళ్లలో 20లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఉంటే నేడు రాష్ట్రంలో ఆడబిడ్డలు బాధపడే పరిస్థితి ఉండేది కాదన్నారు.
Kaleshwaram Project | 20 రోజుల్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి భూమిపూజ
హైదరాబాద్ తర్వాత పెద్దదైన నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 15 నుంచి 20 రోజుల్లో ఇందిరమ్మ టవర్స్కు శంకుస్థాపన చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మిగిలిపోయిన మొండి గోడలతో ఉన్న ఇళ్లను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. 400 ఇందిరమ్మ గృహాలను పారదర్శకంగా అందరి సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు అందజేసిన ఘనత కాంగ్రెస్ ప్రబుత్వానిదన్నారు.
Kaleshwaram Project | ప్రభుత్వ కార్యాలయాలకు మార్దశ..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తహశీల్దార్, ఆర్డీవో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పూర్తి శిథిలావస్థకు చేరాయని.. కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని పొంగులేటి అన్నారు. వాటన్నిటికి కొత్త భవనాలు నిర్మించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో 10 కంటే ఎక్కువ స్థలాల్లో కొత్త కార్యాలయాలకు శంకుస్థాపన నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు కేవలం రూ.230కే సిమెంటు బస్తా ఇచ్చే విధంగా సిమెంట్ కంపెనీలను ఒప్పించామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం తగ్గడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్ల క్రితమే పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి బాటలు వేసిందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తున్నామన్నారు.
పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరైన జిల్లా నిజామాబాద్ అని పేర్కొన్నారు. అలాగే మహిళలను సంతోషంగా చూడాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు అనేక సంక్షేమ పథకాలు వారి పేరుతోనే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 ఉచిత కరెంట్, మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, ఇలా అనేక పథకాలు అమలు చేస్తూ రానున్న రెండున్నర ఇళ్లలో మరింత ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆయా కార్పొరేషన్ల ఛైర్మన్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, సీనియర్ నాయకులు కవితారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: GGH Newborn Death | జీజీహెచ్లో నవజాత శిశువు మృతి.. వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన