అక్షర టుడే వెబ్డెస్క్: KTR Jindal University | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హర్యానాలోని ప్రముఖ ‘ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ’ ( Jindal University )నుంచి ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. ఆ యూనివర్సిటీకి వెళ్లి అక్కడి విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించడంతో పాటు, ప్రత్యేక ఉపన్యాసం (డిస్టింగ్విష్డ్ పబ్లిక్ లెక్చర్) ఇవ్వాల్సిందిగా కోరుతూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సి. రాజ్ కుమార్ కేటీఆర్కు లేఖ రాశారు. కేటీఆర్ ఆలోచనలు, ఆయన చేసే ప్రసంగం విద్యార్థులలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయని వీసీ ఆ లేఖలో పేర్కొన్నారు. కేటీఆర్కు తగిన తేదీ, సమయాన్ని బట్టి 2026 సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
KTR Jindal University | 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..
ఈ పర్యటనలో భాగంగా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన భారత్లోనే తొలి రాజ్యాంగ మ్యూజియం, రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ అకాడమీని సందర్శించాలని కూడా కేటీఆర్ను కోరారు. భారత రాజ్యాంగానికి ఆమోదం లభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాజ్యాంగ నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లు, పోరాటాలు, నిర్మాతల కృషిని తెలిపే అద్భుతమైన ప్రదర్శనలు ఉన్నాయి.
KTR Jindal University | ప్రత్యేక గుర్తింపు ..
2009లో ఏర్పాటైన ఓ.పి. జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ.. పరిశోధన ఆధారిత విద్యా సంస్థగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందింది. 2020లో కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ నుంచి ‘ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్’ హోదాను కూడా దక్కించుకుంది. గతంలో దేశ ప్రసిద్ధులు, రాష్ట్రపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు ఈ యూనివర్సిటీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరి ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ స్వీకరిస్తారా లేదా అనేది త్వరలోనే తెలియనుంది.
ఇది కూడా చదవండి: Khelo India Youth Games | ఒలింపిక్స్ 2036 టార్గెట్.. యువ క్రీడాకారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం