అక్షరటుడే, వెబ్డెస్క్: DJ Sound | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని సుల్తాన్పూర్ జిల్లాలో ఒక విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఊరేగింపులో వినిపించిన డీజే భారీ శబ్దం కారణంగా తమ ఫారంలో ఉన్న కోళ్లు మృతి చెందాయని ఓ పౌల్ట్రీ ఫామ్ యజమాని ఆరోపించడం సంచలనంగా మారింది.
బల్దిరాయ్ పోలీస్ స్టేషన్ (Baldiray Police Station) పరిధిలోని దరియాపూర్ గ్రామం (Dariyapur Village)లో సబీర్ అలీ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫామ్ నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 25 రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో బబ్బన్ విశ్వకర్మ కుమార్తె వివాహ ఊరేగింపు ఆయన ఫామ్ పక్కనుండి వెళ్లింది. ఈ సందర్భంగా డీజే నుంచి వచ్చిన తీవ్ర శబ్దం వల్ల కోళ్లు భయంతో గాబరా పడ్డాయని సబీర్ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
DJ Sound | డీజే శబ్దంతో చనిపోయిన కోళ్లు..
ఆ శబ్దాన్ని తట్టుకోలేక సుమారు 140 కోళ్లు ఒక్కసారిగా చనిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో భారీ నష్టం వాటిల్లిందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డీజే ఆపరేటర్ కవి యాదవ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బల్దిరాయ్ ఎస్హెచ్వో మహేంద్ర ప్రతాప్ సింగ్ ఈ ఘటనను ధృవీకరిస్తూ, అనుమతించిన శబ్ద పరిమితిని మించి డీజే వాడారా అనే కోణంలో విచారణ జరుగుతోందన్నారు.
DJ Sound | అవసరమైతే వెటర్నరీ నిపుణుల నివేదిక
అయితే కోళ్ల మృతికి నిజంగా డీజే శబ్దమే కారణమా, లేక మరేదైనా ఆరోగ్య సంబంధిత లేదా పర్యావరణ కారణాలున్నాయా అన్న దానిపై అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. అవసరమైతే వెటర్నరీ నిపుణుల నివేదికను కూడా తీసుకుంటామని తెలిపారు.ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, శబ్ద కాలుష్యంపై మరోసారి చర్చ మొదలైంది.
ఇది కూడా చదవండి..: Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

