Goa Hockey Accident | గోవాలో విషాద ఘటన.. హాకీ బంతి తలకు తగిలి 13 ఏళ్ల బాలిక మృతి..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Goa Hockey Accident | గోవా (Goa)లోని గుయిరింలో ఉన్న సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌ (St. Anthony’s High School)లో విషాదం నెలకొంది. 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల రుయీషా ఖర్సెల్ హాకీ ప్రాక్టీస్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.

వేసవి సెలవులకు ముందు పాఠశాల చివరి రోజు కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా క్రీడా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జరగబోయే పోటీల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రాక్టీస్ సమయంలో హాకీ బంతి వేగంగా వచ్చి రుయీషా తలకు బలంగా తగిలింది. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

Goa Hockey Accident | కూతురి మ‌ర‌ణంతో క‌న్నీరు మున్నీరుగా..

పరిస్థితి సీరియ‌స్‌గా ఉండటంతో వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవుతుందని తెలిసి, పాఠశాల సిబ్బంది ఆమెను ప్రైవేట్ వాహనంలో సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక శుక్రవారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రమాదం పాఠశాల సమయాల్లోనే జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ మిల్చెస్టర్ ఫర్టాడో వెల్లడించారు. రుయీషాకు హాకీపై ప్రత్యేక ఆసక్తి ఉండేది. తన అన్న సూరజ్‌ను చూసి స్ఫూర్తి పొందిన ఆమె రెండు సంవత్సరాల క్రితమే హాకీ ఆడటం ప్రారంభించింది.

Goa Hockey Accident | చెల్లి ఎప్పుడూ నా హాకీ స్టిక్‌తోనే ఆడేది

15 ఏళ్ల సూరజ్ ఇటీవల జరిగిన సబ్-జూనియర్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో గోవా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. “ప్రాక్టీస్ ముగియడానికి కేవలం పది నిమిషాలు మాత్రమే ఉండగా ఈ ప్రమాదం జరిగింది. చెల్లి ఎప్పుడూ నా హాకీ స్టిక్‌తోనే ఆడేది” అంటూ అతను కన్నీటి పర్యంతమయ్యాడు. రుయీషా కుటుంబం సాధారణ పరిస్థితుల్లో జీవిస్తోంది. తల్లి ఇళ్ల‌ల్లో ప‌నులు చేస్తూ, తండ్రి స్థానిక దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తె అకస్మిక మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. “నిన్ను కాపాడుకోలేకపోయాను… నన్ను వదిలి ఎందుకు వెళ్లిపోయావు” అంటూ తల్లి విలపించిన తీరు అక్కడున్న వారిని కదిలించింది.

ఇది కూడా చదవండి..: Bank Holidays in May | మే లో 9 రోజులు బ్యాంకులు బంద్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *