అక్షరటేడే, వెబ్డెస్క్: PMJ Robbery | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అత్యంత రద్దీగా ఉండే కోర్టు ఆవరణ ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ దోపిడీ జరిగింది. స్థానిక పీఎంజే (PMJ) జ్యువెలరీ షోరూమ్లోకి తుపాకులతో ప్రవేశించిన దుండగుల ముఠా బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడటంతో పాటు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.
PMJ Robbery | దోపిడీ జరిగిన తీరు..
సిబ్బంది ఆదివారం ఉదయం షోరూమ్ తెరిచిన కొద్దిసేపటికే ఐదుగురు సభ్యుల ముఠా తుపాకులతో లోపలికి చొరబడింది. సిబ్బందిని తుపాకులతో బెదిరించిన దొంగలు, వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. అనంతరం షోరూమ్లోని విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బయటకు వెళ్లే క్రమంలో నిందితులు గాల్లోకి కాల్పులు జరపడంతో నలుగురు స్టాఫ్ సభ్యులు గాయపడ్డారు.
PMJ Robbery | పోలీసుల దర్యాప్తు..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. షోరూమ్లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని పరిశీలించగా, దుండగులు సిబ్బందిని బెదిరిస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పట్టపగలే జనసంచారం మధ్య ఈ తరహా దోపిడీ జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దొంగిలించిన బంగారం విలువపై అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఘటన విషయం తెలియగానే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేర్వేరుగా షోరూమ్ను సందర్శించారు.
ఇది కూడా చదవండి: Kavitha New Party | కేసీఆర్, కవితల మధ్య విభేదాలపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

