అక్షరటుడే, వెబ్డెస్క్: Accident in Tirupati | తిరుపతి జిల్లా (Tirupati District)లో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. రహదారి పక్కన ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నుంచి ఓ రోగిని మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు అంబులెన్స్లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో వేగంగా ప్రయాణిస్తున్న అంబులెన్స్, ముందుగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గమనించకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఢీకొన్న ప్రభావంతో అంబులెన్స్ (Ambulance) ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
Accident in Tirupati | డ్రైవర్ పరిస్థితి విషమంగా…
ఈ ప్రమాదంలో అంబులెన్స్లో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా పశ్చిమ బెంగాల్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉన్నాడు. గాయపడిన వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రి (RUIA Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని లేదంటే అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాళహస్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోగా, పోలీసులు వేగంగా స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Andhra Tax Collection | ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ సృష్టించిన పన్నుల వసూళ్లు.. ఏప్రిల్లో రూ. 5,542 కోట్ల ఆదాయం

